-

పృథ్వీ షాకు మోక్షం.. అభినవ బ్రాడ్‌మన్‌కు లభించని కటాక్షం

14 Jan, 2023 15:43 IST|Sakshi

Prithvi Shaw-Sarfaraz Khan: ఈనెల (జనవరి) 18 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లకు అలాగే ఆ్రస్టేలియాతో సొంతగడ్డపై జరిగే ‘బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ’లోని తొలి రెండు టెస్టుల కోసం భారత జట్టును సెలెక్టర్లు నిన్న (జనవరి 13) ప్రకటించారు. వన్డే జట్టులో ఆంధ్ర వికెట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్‌కు తొలిసారి అవకాశం లభించగా.. శార్దుల్‌ ఠాకూర్‌, లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ షహబాజ్‌ అహ్మద్‌ పునరాగమనం చేశారు.

వ్యక్తిగత కారణాలతో కేఎల్‌ రాహుల్, అక్షర్‌ పటేల్‌ వన్డేతో పాటు టీ20 జట్ల ఎంపికకు దూరంగా ఉన్నారు. అర్షదీప్‌ సింగ్‌పై వేటు పడిం‍ది. ఈ మార్పులు మినహా ప్రస్తుతం శ్రీలంకతో వన్డే సిరీస్‌ ఆడుతున్న జట్టునే యధాతథంగా కొనసాగించారు సెలెక్టర్లు. ఈ నెల 18, 21, 24 తేదీల్లో వన్డేలు జరుగుతాయి.  

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్‌ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్

టీ20 జట్టు విషయానికొస్తే.. ఏడాదిన్నర క్రితం ఏకైక టీ20 ఆడిన పృథ్వీ షా తిరిగి జట్టులో చోటు లభించగా, తాజాగా శ్రీలంకతో టీ20 సిరీస్‌ ఆడిన జట్టునే ఈ సిరీస్‌లోనూ యధాతథంగా కొనసాగించారు. ఈ నెల 27, 29, ఫిబ్రవరి 1 తేదీల్లో టీ20లు జరుగనున్నాయి.   

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా: హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), సూర్యకుమార్ యాదవ్ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), రుతురాజ్‌ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, చహల్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ , శివం మావి, పృథ్వీ షా, ముఖేష్ కుమార్

ఇక టెస్ట్‌ జట్టు విషయానికొస్తే (ఆస్ట్రేలియాతో తొలి 2 టెస్ట్‌లకు).. టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌, ఇటీవలే వన్డేల్లో డబుల్‌ సెంచరీ బాదిన ఇషాన్‌ కిషన్‌ తొలిసారి టెస్ట్‌ జట్టులో చోటు దక్కించుకోగా రవీంద్ర జడేజా పునరాగమనం చేశాడు. ఫిబ్రవరి 9న తొలి టెస్ట్‌ (నాగ్‌పూర్‌), ఫిబ్రవరి 17న (ఢిల్లీ) రెండో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగనున్నాయి.

ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), కేఎల్ రాహుల్ (వైస్‌ కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, పుజారా, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్‌ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్

ఇదిలా ఉంటే, గత కొంత కాలంగా దేశవాలీ టోర్నీల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఇ‍ద్దరు యువ క్రికెటర్లలో ఒకరికి టీమిండియా తలుపులు తెరుచుకోగా.. మరొకరిని మాత్రం సెలెక్టర్లు కరుణించలేదు. ఆ ఇద్దరు ఎవరంటే.. పృథ్వీ షా, ముంబై క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌. తాజాగా ముగిసిన రంజీ మ్యాచ్‌లో భారీ ట్రిపుల్‌ సెంచరీ (379) బాదిన పృథ్వీ షాను సెలెక్టర్లు ఎ‍ట్టకేలకు కరుణించగా.. అభినవ బ్రాడ్‌మన్‌గా పేరొందిన సర్ఫరాజ్‌ అహ్మద్‌కు ఇంకా కటాక్షం లభించలేదు.

2019 నుంచి రంజీల్లో అద్బుతంగా రాణిస్తూ.. ప్రస్తుత సీజన్‌లోనూ 5 మ్యాచ్‌ల్లో 431 పరుగులు (2 సెంచరీలు) చేసిన సర్ఫరాజ్‌కు భారత టెస్ట్‌ జట్టులో (ఆసీస్‌ సిరీస్‌) చోటు గ్యారెంటీ అని అంతా ఊహించినప్పటికీ ముంబై ఆటగాడికి మరోసారి మొండిచెయ్యే ఎదురైంది. గత 22 ఇన్నింగ్స్‌ల్లో 71*, 36, 301*, 226*, 25, 78, 177, 6, 275, 63, 48, 165, 153, 40, 59*, 134, 45, 5, 126*, 75, 20, 162  ఓ ట్రిపుల్‌ సెంచరీ, 2 డబుల్‌ సెంచరీలు, 6 సెంచరీలు, 5 అర్ధసెంచరీ బాది పరుగల వరద పారించిన సర్ఫరాజ్‌ను కాదని టీ20ల్లో సత్తా చాటాడన్న కారణంగా సూర్యకుమార్‌ను టెస్ట్‌ జట్టుకు ఎంపిక చేయడం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే ఓ ఆటగాడిగా ఇంతకంటే ఏం చేయాలని సెలెక్టర్లను నిలదీస్తున్నారు. జాతీయ జట్టులోకి రావాంటే రంజీల్లో ప్రదర్శనే ​కొలమానం అని ప్రకటించిన బీసీసీఐ న్యూ బాస్‌ రోజర్‌ బిన్నీ సర్ఫరాజ్‌కు జరిగిన అన్యాయంపై సమాధానం చెప్పాలని పట్టుబడుతున్నారు. 

మరిన్ని వార్తలు