ఓవర్‌ ముగిసిందని రిలాక్స్‌ అయ్యా.. ధావన్‌ గుర్తు చేశాడు

27 May, 2021 22:05 IST|Sakshi

ఢిల్లీ: టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున దుమ్మురేపిన సంగతి తెలిసిందే. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌తో పోటీ పడుతూ పరుగులు సాధించిన పృథ్వీ 8 మ్యాచ్‌ల్లో 308 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ముఖ్యంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా 41 బంతుల్లోనే 82 పరుగులు సాధించాడు. ఇదే మ్యాచ్‌లో శివమ్‌ మావీ బౌలింగ్‌లో పృథ్వీ ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టి ఐపీఎల్‌లో ఈ ఘనత అందుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు. అంతకముందు రాజస్థాన్ రాయల్స్ తరపున అజింక్య రహానే ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు బాదాడు.

తాజాగా ఆరోజు ఓవర్‌ ముగిసిన తర్వాత జరిగిన ఒక చిన్న సంఘటనను పృథ్వీ రివీల్‌ చేశాడు. ''ఐదో బంతిని బౌండరీకి తరలించిన కొద్దిసేపటి తర్వాత ఆరో బంతి ఉందని నాకు తెలిసింది. ఫస్ట్ బాల్‌ని శివమ్ మావీ వైడ్‌గా వేసిన విషయం నేను మర్చిపోయాను. దాంతో.. ఓవర్ అయిపోయిందని రిలాక్స్ అయ్యా. కానీ.. శిఖర్ ధావన్ దగ్గరికి వచ్చి ఇంకో బాల్ మిగిలి ఉంది అని గుర్తు చేశాడు. ఆరు ఫోర్లు కొట్టే వరకూ రికార్డ్ గురించి నేను ఆలోచించలేదు'' అని పృథ్వీ చెప్పుకొచ్చాడు.

కాగా జూన్ 2న ఇంగ్లాండ్ టూర్‌కి టీమిండియా వెళ్లనుంది. శిఖర్ ధావన్‌తో పాటు పృథ్వీ షాకు భారత టెస్టు జట్టులో అవకాశం దక్కలేదు. అయితే.. జులైలో శ్రీలంక పర్యటనకు టీమిండియా రెండో జట్టు.. మూడు వన్డేలు, మూడు టీ20లను ఆడేందుకు వెళ్లనుంది. ఆ టీమ్‌కి శిఖర్ ధావన్ కెప్టెన్‌గా ఎంపికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పృథ్వీ షా కూడా జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.
చదవండి: 'ఆ సమయంలో ద్రవిడ్‌ను చూసి భయపడేవాళ్లం'

పృథ్వీ షాకు పూనకం.. తల పట్టుకున్న శివమ్‌ మావి

మరిన్ని వార్తలు