Pro Kabaddi 2022: మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్‌

19 Nov, 2022 05:31 IST|Sakshi
బెంగాల్‌ వారియర్స్‌ రెయిడర్‌ శ్రీకాంత్‌ జాదవ్‌ను నిలువరించే యత్నంలో తెలుగు టైటాన్స్‌ ఆటగాళ్లు

సాక్షి, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ పరాజయాల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం హైదరాబాద్‌ అంచె మ్యాచ్‌లు మొదలయ్యాయి. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 28–36తో బెంగాల్‌ వారియర్స్‌ చేతిలో ఓడిపోయింది. ఈ లీగ్‌లో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్‌ ఒక్క మ్యాచ్‌లో నెగ్గి, 14 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. తొమ్మిది పాయింట్లతో టైటాన్స్‌ చివరిదైన 12వ స్థానంలో ఉంది.

వారియర్స్‌తో మ్యాచ్‌లో టైటాన్స్‌ తరఫున రెయిడర్లు అభిషేక్‌   సింగ్‌ తొమ్మిది పాయింట్లతో, సిద్ధార్థ్‌ దేశాయ్‌ ఎనిమిది పాయింట్లతో, పర్మేశ్‌ ఐదు పాయింట్లతో రాణించారు. వారియర్స్‌ తరఫున మణీందర్‌ సింగ్‌ 12 పాయింట్లతో టాప్‌ స్కోరర్‌గా నిలువగా... శ్రీకాంత్‌ జాదవ్‌ ఏడు పాయింట్లు స్కోరు చేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌ 41–28తో హరియాణా స్టీలర్స్‌పై, బెంగళూరు బుల్స్‌ 45–38తో గుజరాత్‌ జెయింట్స్‌పై గెలిచాయి. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌; యు ముంబాతో తెలుగు టైటాన్స్‌; దబంగ్‌ ఢిల్లీతో పట్నా పైరేట్స్‌ తలపడతాయి.  

మరిన్ని వార్తలు