బెంగాల్‌ వారియర్స్‌కు పట్నా పైరేట్స్‌ షాక్‌ 

1 Jan, 2022 07:16 IST|Sakshi

సింగిల్‌ రెయిడ్‌లో ఏడు పాయింట్లు సాధించిన పట్నా ప్లేయర్‌ మోనూ గోయట్‌  

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో పట్నా పైరేట్స్‌ జట్టు తమ ప్రతాపం చూపించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగాల్‌ వారియర్స్‌కు షాక్‌ ఇచ్చింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 43–29 పాయింట్ల తేడాతో బెంగాల్‌ వారియర్స్‌ను ఓడించింది. పట్నా రెయిడర్‌ మోనూ గోయట్‌ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. పట్నా 32–25తో ఆధిక్యంలో ఉన్న దశలో మోనూ గోయట్‌ సింగిల్‌ రెయిడ్‌లో ఏకంగా ఏడు పాయింట్లు సాధించి అబ్బురపరిచాడు.

మ్యాచ్‌ మొత్తంలో మోనూ 15 పాయింట్లు సాధించి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఈ లీగ్‌ చరిత్రలో మోనూ 500 రెయిడింగ్‌ పాయింట్లు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ లీగ్‌లో పట్నాకిది మూడో విజయం. బెంగాల్‌ వారియర్స్‌ తరఫున మణీందర్‌ సింగ్‌ 12 పాయింట్లు సాధించాడు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌ 36–26తో పుణేరి పల్టన్‌ను ఓడించి ఈ లీగ్‌లో తొలి విజయం నమోదు చేసింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో యూపీ యోధ; బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్‌; దబంగ్‌ ఢిల్లీతో తమిళ్‌ తలైవాస్‌ తలపడతాయి.    

మరిన్ని వార్తలు