నేటి నుంచి థాయ్‌లాండ్‌ ఓపెన్‌

12 Jan, 2021 06:24 IST|Sakshi

బరిలో సైనా, సింధు, సాయిప్రణీత్‌

బ్యాంకాక్‌: టోక్యో ఒలింపిక్స్‌కు ముందు తమ రాకెట్‌ సత్తా చాటేందుకు భారత అగ్రశ్రేణి షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ బరిలోకి దిగుతున్నారు. కరోనా వైరస్‌తో దాదాపు 10 నెలల తర్వాత వీళ్లిద్దరు అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఆడనున్నారు. వీరితో పాటు భారత ఆటగాళ్లంతా మంగళవారం నుంచి జరిగే థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌–1000 టోర్నమెంట్‌లో పాల్గొననున్నారు. ఇందులో జపాన్, చైనా ప్లేయర్లు గైర్హాజరీ కావడంతో భారత స్టార్లు టైటిల్‌ గెలిచేందుకు ఇది సరైన అవకాశం. లండన్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన 25 ఏళ్ల సింధు ఆరో సీడ్‌గా ఆట మొదలు పెట్టనుంది. తొలిరౌండ్లో ఆమె డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో తలపడనుంది. ప్రపంచ 20వ ర్యాంకర్‌ సైనా తొలి రౌండ్లో కిసొనా సెల్వడురే (మలేసియా)తో పోటీ పడుతుంది. పురుషుల సింగిల్స్‌ తొలిరౌండ్‌ మ్యాచ్‌ల్లో 14 ర్యాంకర్‌ శ్రీకాంత్‌ భారత్‌కే చెందిన సౌరభ్‌ వర్మతో, వంగ్చరొన్‌ (థాయ్‌లాండ్‌)తో సాయిప్రణీత్, లీ జి జియా (మలేసియా)తో ప్రణయ్, జాసన్‌ అంథోని (కెనడా)తో కశ్యప్‌ ఆడతారు.

>
మరిన్ని వార్తలు