PV Sindhu: రెండుసార్లు పతకం గెలవడం ఆషామాషీ కాదు

4 Aug, 2021 09:56 IST|Sakshi
సాక్షితో మాట్లాడుతున్న పీవీ సింధు తండ్రి పీవీ రమణ, పీవీ సింధు

ఆ సమయంలో కోచ్‌, తల్లిదండ్రులు ప్రోత్సహించారు: పీవీ సింధు

సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో కాంస్య పతకం రావడం ఆనందంగా ఉందని తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు హర్షం వ్యక్తం చేశారు. దేశానికి పతకం తెచ్చినందుకు గర్వంగా ఉందన్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన అనంతరం బుధవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా... ‘‘సెమీస్‌లో ఓడినప్పుడు కొంచెం బాధేసింది. ఆ సమయంలో కోచ్, పేరెంట్స్‌ నాకు మద్దతుగా నిలిచారు. నాకు మరో ఛాన్స్ ఉందని ప్రోత్సహించారు. కాంస్యం పతకం రావడం చాలా సంతోషంగా ఉంది. ఒలింపిక్స్‌లో పతకం గెలవడం ఓ డ్రీమ్‌. వచ్చే టోర్నమెంట్‌లో బంగారు పతకం సాధించేందుకు కష్టపడతా’’ అని పీవీ సింధు పేర్కొన్నారు.


సీఎం జగన్‌ ఎంతో ప్రోత్సహించారు:
ఒలింపిక్స్‌లో రెండుసార్లు పతకం సాధించడం ఆషామాషీ కాదని టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత పీవీ సింధు తండ్రి రమణ అన్నారు. ఎంతో కఠినమైన పోటీ ఉంటుందని, దానిని ఎదుర్కొని సింధు పతకం గెలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ‘‘సింధు ప్రతిరోజు 7 గంటలు ప్రాక్టీస్ చేసింది. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు ప్రధాని మోదీ మాట్లాడారు. పతకం తీసుకొచ్చిన తర్వాత ఐస్‌క్రీమ్ తిందామని ప్రధాని అన్నారు. 

మరికొద్ది రోజుల్లో ప్రధాని మోదీని కలుస్తాం. కేంద్రం నుంచి మంచి ప్రోత్సాహం ఉంది. కేంద్రం నుంచి వచ్చే ప్రోత్సాహాలు నేరుగా క్రీడాకారులకు అందాలి. మరింత పారదర్శకత అవసరం’’ అని తెలిపారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సింధును ప్రోత్సహించారన్న ఆయన.. ‘‘మళ్లీ పతకం తెస్తున్నావా? అని సీఎం అడిగారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు శాలువా కప్పి ఆల్‌ ది బెస్ట్ చెప్పారు’’ అని హర్షం వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు