వ్యంగ్య పోస్టుపై అభిమానుల ఫైర్‌!

2 Nov, 2020 17:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పూసర్ల వెంటక సింధు‌ ఆటకు రిటైర్‌మెంట్‌ ప్రకటించానంటూ వ్యంగ్య పోస్టు చేసి అభిమానులను ఒకింత షాక్‌కు గురి చేశారు. సోమవారం ట్విటర్‌ వేదికగా.. ‘నేను రిటైర్‌ అయ్యాను. డెన్మార్క్‌ ఓపెన్‌ నా చివరి ఆట’ అని పేర్కొన్నారు. అనంతరం చేసిన ఓ సుదీర్ఘ ప్రకటనలో ‘కరోనా మహమ్మారి నాకు కనువిప్పుగా మారింది. నా ప్రత్యర్థితో పోరాడటానికి కఠోరమైన శిక్షణ తీసుకునేదాన్ని. చివరి వరకు పోరాడేదాన్ని. ఇంతకు ముందు చేశాను, ఇకపై కూడా చేయగలను. ( నా తల్లిదండ్రుల అనుమతితోనే: పీవీ సింధు )

కానీ, కంటికి కనిపించని వైరస్‌ను ఎలా ఓడించగలను. నెలలు గడుస్తున్నాయి. బయటకు వెళ్లాలనుకునే ప్రతీసారి ఆలోచిస్తున్నాము. విశ్రాంతి లేని ఆటకు స్వప్తి పలకాలని నిశ్చయించుకున్నాను. నెగిటివిటీ, భయం, అనిశ్చితి నుంచి రిటైర్‌ అవ్వబోతున్నాను. ప్రతీరోజు సోషల్‌ మీడియాలో చదువుతున్న కథనాలను నన్ను నేను ప్రశ్నించుకునేలా చేశాయి. మనం మరింత సంసిద్ధంగా ఉండాలి. కలిసికట్టుగా వైరస్‌ను ఓడించాలి. మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయం మన, మన భావితరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వారిని ఓడిపోనివ్వకుండా చూడాలి’..

‘‘డెన్మార్క్‌ ఓపెన్‌ జరగలేదు. కానీ, నేను ప్రాక్టీస్‌ చేయటం మానలేదు. ఏషియా ఓపెన్‌కు ప్రిపేర్‌ అవుతున్నాను. దేన్ని కూడా సులభంగా వదిలి పెట్టడం నాకు ఇష్టం లేదు. ప్రపంచం మొత్తం మీద పరిస్థితులు చక్కబడేవరకు పోరాడుతూనే ఉంటాను’’ అంటూ తన వ్యంగ్య ప్రకటనను ముగించింది. అయితే దీనిపై అభిమానులు మండిపడుతున్నారు. వ్యంగ్యంగా పోస్టు చేయటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు