అది మంచి నిర్ణయం

2 Jan, 2021 04:31 IST|Sakshi

ఇంగ్లండ్‌లో ప్రాక్టీస్‌పై భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు వ్యాఖ్య

న్యూఢిల్లీ: కోవిడ్‌–19తో ఏర్పడిన విరామ సమయంలో ఇంగ్లండ్‌కు వెళ్లి ప్రాక్టీస్‌ చేయడం తాను తీసుకున్న మంచి నిర్ణయమని ప్రపంచ చాంపియన్, భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు చెప్పింది. మెరుగైన శిక్షణ కోసం అక్టోబర్‌లో ఇంగ్లండ్‌ వెళ్లిన సింధు అక్కడే ఉండి తాజా సీజన్‌ కోసం సన్నద్ధమవుతోంది. ఈనెల 12 నుంచి జరుగనున్న థాయ్‌లాండ్‌ ఓపెన్‌తో సింధు మళ్లీ అంతర్జాతీయ టోర్నీ బరిలో దిగనుంది. ‘నిజం చెప్పాలంటే ఇంగ్లండ్‌ రావడం చాలా మంచి నిర్ణయం. ఇక్కడ శీతల వాతావరణం ఉన్నప్పటికీ, తీవ్రమైన ప్రాక్టీస్‌ సెషన్లను ఆస్వాదిస్తున్నా.

థాయ్‌లాండ్‌ ఈవెంట్‌తో సీజన్‌ను ప్రారంభిస్తా. చాలా కాలం తర్వాత ఈ టోర్నీల్లో పాల్గొనడం ఉత్సాహంగా అనిపిస్తోంది. ఇప్పుడు చాలా ఓపికగా ఆడాల్సి ఉంటుంది. మానసికంగానూ సిద్ధం అవ్వాలి. ఇది ఒలింపిక్స్‌ ఏడాది కాబట్టి థాయ్‌లాండ్‌లో విజయంతో ఈ సీజన్‌ను గొప్పగా ప్రారంభించాలని ఆశిస్తున్నా’ అని లండన్‌లో కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించుకున్న సింధు పేర్కొంది. ఆమె చివరిసారిగా మార్చి 11 నుంచి 15 వరకు జరిగిన ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీలో తలపడింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్న సింధుకు థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో అనుకూలమైన ‘డ్రా’ ఎదురైంది.

మరిన్ని వార్తలు