Indonesia Masters: క్వార్టర్స్‌లో సింధు

10 Jun, 2022 05:07 IST|Sakshi

జకార్తా: ఇండోసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో నాలుగో సీడ్‌ సింధు 23–21, 20–22, 21–11 స్కోరుతో గ్రెగొరియా మరిస్కా (ఇండోనేసియా)పై విజయం సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 30వ స్థానంలో ఉన్న స్థానిక క్రీడాకారిణి గ్రెగొరియా సొంత ప్రేక్షకుల మధ్య సింధుకు తొలి రెండు గేమ్‌లలో గట్టి పోటీనిచ్చింది.

71 నిమిషాల పాటు ఈ పోరు సాగడం విశేషం. చివరి గేమ్‌లో మాత్రం సింధు ఏకపక్షంగా ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్‌ లక్ష్య సేన్‌ 21–18, 21–15తో రస్మస్‌ గెమ్కె (డెన్మార్క్‌)ను ఓడించి క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మాత్రం సుమీత్‌ రెడ్డి– అశ్విని పొన్నప్ప జోడి పరాజయంతో వెనుదిరిగింది. రెండో సీడ్‌ చైనా ద్వయం జెంగ్‌ సీ వీ– హువాంగ్‌ కియాంగ్‌ 21–18, 21–13తో భారత జంటను ఓడించారు.

మరిన్ని వార్తలు