ఉబెర్‌ కప్‌లో ఆడేందుకు సింధు అంగీకారం: ‘బాయ్‌’ చీఫ్‌

8 Sep, 2020 02:36 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు వచ్చే నెలలో జరిగే థామస్‌ కప్‌–ఉబెర్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టీమ్‌ టోర్నీలో దిగనుంది. నిజానికి వ్యక్తిగత కారణాలతో ఆమె ఈ టోర్నీ నుంచి తప్పుకుంది. తన కుటుంబసభ్యులకు చెందిన వేడుక కోసం ఈ టోర్నీలో ఆడనని చెప్పింది. అయితే భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) చీఫ్‌ హిమంత బిశ్వ శర్మ ఆమెను ఆడేందుకు ఒప్పించినట్లు తెలిసింది. ‘ఆ టోర్నీలో భారత్‌కు సానుకూలమైన ‘డ్రా’ ఉండటంతో ఆడాల్సిందిగా సింధును కోరాను. ఆమె జట్టుతో కలిసి ఆడితే భారత్‌కు పతకం అవకాశాలుంటాయని చెప్పాను. దీంతో ఆమె బరిలోకి దిగేందుకు సమ్మతించింది’ అని హిమంత బిశ్వ శర్మ ట్వీట్‌ చేశారు. సింధు తన కుటుంబానికి చెందిన వేడుకను టోర్నీ ప్రారంభానికంటే ముందుగా నిర్వహించుకుంటానని తనతో చెప్పినట్లు ఆయన వివరించారు. డెన్మార్క్‌లో వచ్చేనెల 3 నుంచి 11 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ‘బాయ్‌’ ఈ టీమ్‌ ఈవెంట్‌ కోసం 26 మంది షట్లర్లకు హైదరాబాద్‌లోని గోపీచంద్‌ అకాడమీలో శిబిరం నిర్వహిస్తోంది. 17న తుది జట్లను ఎంపిక చేస్తారు.

మరిన్ని వార్తలు