Indonesia Open: క్వార్టర్స్‌లో సింధు, సాయిప్రణీత్‌

26 Nov, 2021 08:19 IST|Sakshi

బాలి: ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, సాయిప్రణీత్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రవేశించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సింధు 21–12, 21–18తో వైవోన్‌ లీ (జర్మనీ)పై అలవోక విజయం సాధించింది. 37 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో టోర్నీ మూడో సీడ్‌ సింధు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

వరుస గేమ్‌ల్లో మ్యాచ్‌ను ముగించి టోర్నీలో ముందంజ వేసింది. నేడు జరిగే క్వార్టర్స్‌ పోరులో సిమ్‌ యుజిన్‌ (కొరియా)తో సింధు ఆడనుంది.  పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్‌ 21–17, 14–21, 21–19తో క్రిస్టో పోపొవ్‌ (ఫ్రాన్స్‌)పై పోరాడి గెలిచాడు. అయితే మరో భారత షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌కు మాత్రం ప్రిక్వార్టర్స్‌లో నిరాశ ఎదురైంది. శ్రీకాంత్‌ 14–21, 18–21తో టోక్యో ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత విక్టర్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) ద్వయం 21–15, 19–21, 23–21తో కంగ్‌ మిన్‌హ్యూక్‌– సియో సెంగ్‌జే (కొరియా) జంటపై నెగ్గి ముందంజ వేసింది.

చదవండి: IND Vs NZ: మొదటి రోజు దుమ్ములేపిన భారత బ్యాటర్‌లు.. తొలి మ్యాచ్‌లోనే అయ్యర్ అర్ధ సెంచరీ

మరిన్ని వార్తలు