గబ్బా విజయం: రవిశాస్త్రి చెప్పిన మంత్రమిదే

22 Jan, 2021 13:05 IST|Sakshi

గబ్బా విజయంపై ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌. శ్రీధర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ముంబై: గబ్బాలో టీమిండియా‌ 32 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. పింక్‌ బాల్‌ టెస్ట్‌లో 36 పరుగులకే ఆలౌట్‌ అయిన భారత జట్టు.. 40 రోజుల వ్యవధిలో.. అదే ఆస్ట్రేలియాను బ్రిస్బెన్‌ టెస్ట్‌లో మట్టి కరిపించింది. కీలక ఆటగాళ్లు దూరమైనప్పటికి చారిత్రాత్మక విజయం సాధించిన బ్రిస్బేన్‌ టెస్ట్కు ప్రత్యేకతలేన్నో. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పెటర్నటీ లీవ్‌లో ఉన్నాడు.. ఇక సీనియర్‌ ఆటగాళ్లను గాయాలు వెంటాడాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన అజింక్య రహానే ఆధ్వర్యంలో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు గబ్బా వేదికగా చరిత్రని తిరగరాసింది. పింక్‌ బాల్‌ ఓటమికి బదులు తీర్చుకుంది. ఈ నేపథ్యంలో గబ్బా విజయానికి సంబంధించిన ఓ ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. టీమిండియా క్రికెట్‌ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్.శ్రీధర్‌ తన యూట్యూబ్‌ చానెల్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌తో జరిగిన సంభాషణలో ప్రధాన కోచ్ రవిశాస్త్రి చేసిన ప్రసంగం అడిలైడ్‌లో ఎదుర్కొన్న ఓటమి నుంచి టీమిండియా అదృష్టాన్ని ఎలా మలుపు తిప్పిందో వెల్లడించారు.
(చదవండి: క్రికెటర్స్‌.. ‘గేమ్‌’చేంజర్స్‌..!)

ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ, ‘‘36 ఆలౌట్ తరువాత ఏం జరిగిందో మీకు తెలియదు. అప్పుడు రవి (శాస్త్రి) భాయ్ జట్టు సభ్యులను పిలిచి ఇలా అన్నాడు.. ‘‘ఈ 36 ను మీ స్లీవ్స్‌లో బ్యాడ్జ్ లాగా ధరించండి.. ఆ ఓటమి మీలో కసి పెంచుతుంది. మీ ఆట తీరు మారుతుంది. ఇక చూడండి మీరు గొప్ప జట్టు అవుతారు’’ అన్నాడు. 40 రోజుల వ్యవధిలో రవిశాస్త్రి మాటలు నిజం అయ్యాయి. అలాగే, అడిలైడ్ టెస్ట్ అనంతరం రెండు రోజుల వ్యవధిలో మేము ఐదు సార్లు సమావేశం అయ్యాం. విరాట్ (కోహ్లీ), జింక్స్ (అజింక్య రహానె), కోచింగ్ సిబ్బంది కాంబినేషన్స్‌ గురించి చర్చించారు. విరాట్ కొన్ని అద్భుతమైన సూచనలు ఇచ్చాడు. వాటన్నింటి ఫలితమే ఈ విజయం’’ అన్నారు శ్రీధర్‌.
(నన్ను ఎవరితోనూ పోల్చకండి: పంత్‌)

Poll
Loading...
మరిన్ని వార్తలు