రాఫెల్‌ నాదల్‌కు షాక్‌

21 Sep, 2020 08:42 IST|Sakshi

ఇటాలియన్‌ ఓపెన్‌లో డీగో ష్వార్ట్‌జ్‌మన్‌ సంచలనం

రోమ్‌: ఏడు నెలల విరామం తర్వాత తొలి టోర్నమెంట్‌లో బరిలోకి దిగిన స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌కు నిరాశ ఎదురైంది. ఇటాలియన్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 క్లే కోర్టు టోర్నీలో తొమ్మిదిసార్లు చాంపియన్‌ నాదల్‌ పోరాటం క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. క్లే కోర్టులపై తిరుగులేని నాదల్‌ను ప్రపంచ 15వ ర్యాంకర్‌ డీగో ష్వార్ట్‌జ్‌మన్‌ (అర్జెంటీనా) బోల్తా కొట్టించాడు. రెండు గంటల మూడు నిమిషాలపాటు జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ష్వార్ట్‌జ్‌మన్‌ 6–2, 7–5తో నాదల్‌ను ఓడించాడు.

గతంలో నాదల్‌తో ఆడిన తొమ్మిదిసార్లూ ఓడిపోయిన ష్వార్ట్‌జ్‌మన్‌ పదో ప్రయత్నంలో విజయం రుచి చూడటం విశేషం. మ్యాచ్‌ మొత్తంలో నాదల్‌ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసిన ష్వార్ట్‌జ్‌మన్‌ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. రెండో సెమీఫైనల్లో డెనిస్‌ షపోవలోవ్‌ (కెనడా)తో ష్వార్ట్‌జ్‌మన్‌ ఆడతాడు. మరోవైపు తొలి సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ 7–5, 6–3తో కాస్పర్‌ రూడ్‌ (నార్వే)పై గెలిచాడు. ఇదే టోర్నీ మహిళల సింగిల్స్‌లో సిమోనా హలెప్‌ (రొమేనియా), ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) టైటిల్‌ పోరుకు అర్హత సాధించారు. 

మరిన్ని వార్తలు