రహానే ఖాతాలో స్పెషల్‌ మెడల్‌.. దాని ప్రత్యేకత ఏమిటి?

29 Dec, 2020 14:31 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి అదుర్స్‌ అనిపించింది. ఆసీస్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కట్టడి చేసిన టీమిండియా.. నాల్గో రోజే విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆసీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకే నియంత్రించింది. ఫలితంగా టీమిండియా 70 పరుగుల స్వల్ప లక్ష్యాన్నే ఛేదించాల్సి వచ్చింది. ఆ లక్ష్యాన్ని టీమిండియా రెండు వికెట్లు చేజార్చుకుని ఛేదించింది. మయాంక్‌ అగర్వాల్‌(5), చతేశ్వర్‌ పుజారా(3)లు తొందరగానే పెవిలియన్‌కు చేరినా, శుబ్‌మన్‌ గిల్‌(35 నాటౌట్‌), రహానే(27 నాటౌట్‌)లు మరో వికెట్‌ పడకుండా ఆడి జట్టుకు విజయాన్నిఅందించారు. (చదవండి: బాక్సింగ్‌ డే టెస్టులో భారత్‌ ఘన విజయం)

ఆ స్పెషల్‌ మెడల్‌ రహానేదే..
ఈ మ్యాచ్‌లో విశేషంగా రాణించిన రహానేకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో రహానే(112) సెంచరీ చేసి భారత్‌ మూడొందల పరుగుల మార్కును చేరడంలో సహకరించారు. కీలక వికెట్లు కోల్పోయిన తరుణంలో రహానే ఒక సొగసైన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. దాంతో రహానేకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ క్రమంలోనే జానీ ములాగ్‌ మెడల్‌ను కూడా రహానే దక్కించుకున్నాడు. డిసెంబర్‌ 26వ తేదీన ఆరంభమైన బాక్సింగ్‌ డే టెస్టు మ్యాచ్‌లో భాగంగా మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్న క్రికెటర్‌కు ములాగ్‌ మెడల్‌ ఇవ్వాలని సీఏ (క్రికెట్‌ ఆస్ట్రేలియా) నిర్ణయించింది. దాంతో ఆ మెడల్‌ను అందుకున్న తొలి క్రికెటర్‌గా రహానే అరుదైన ఘనతను సాధించాడు. 


ఆ మెడల్‌ ప్రత్యేకత ఏమిటి?
జానీ ములాగ్‌ మెడల్‌కు ఒక ప్రతేకత ఉంది. ఇది ఆస్ట్రేలియాకు సారథ్యం వహించిన ఒక కెప్టెన్‌కు ఇచ్చిన గౌరవం. 1868 కాలంలో ఆసీస్‌కు ములాగ్‌ కెప్టెన్‌గా చేశాడు. అదే సమయంలో ఆసీస్‌ జట్టు ఇతని కెప్టెన్సీలోనే తొలి విదేశీ పర్యటనకు వెళ్లింది. ములాగ్‌ సారథ్యంలో బ్రిటన్‌లో ఆనాటి ఆసీస్‌ పర్యటించింది. ఆ సుదీర్ఘ పర్యటనలో ములాగ్‌ 47 మ్యాచ్‌లు ఆడి 1,698 పరుగులు చేశాడు. ఇక 831 ఓవర్లు బౌలింగ్‌ వేసి 245 వికెట్లు సాధించాడు. ఇక్కడ అతని యావరేజ్‌ 10.00 గా నమోదైంది. ఇక తన కెరీర్‌లో వికెట్‌ కీపర్‌ పాత్రను కూడా ములాగ్‌ పోషించాడు. నాలుగు స్టంపింగ్స్‌ ములాగ్‌ ఖాతాలో ఉన్నాయి. (చదవండి: రహానే కెప్టెన్సీపై దిగ్గజాల ప్రశంసలు..)

>
మరిన్ని వార్తలు