వారిని క్షమించు.. జట్టును కాపాడుకో.. కోహ్లికి బాసటగా నిలిచిన రాహుల్‌ గాంధీ

2 Nov, 2021 20:37 IST|Sakshi

Rahul Gandhi Tweets In Support Of Virat Kohli: టీ20 ప్రపంచకప్‌-2021లో దాయాది పాకిస్థాన్‌ చేతిలో ఘోర పరాజయం అనంతరం భారత పేసర్‌ మహ్మద్‌ షమీని టార్గెట్‌ చేస్తూ.. కొందరు దురభిమానులు సోషల్‌మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రస్తుత, మాజీ క్రికెటర్లతో పాటు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సైతం షమీకి అండగా నిలిచాడు. అయితే, కోహ్లి.. షమీకి అండగా నిలబడటాన్ని జీర్ణించుకోలేని కొందరు దుర్మార్గులు విరుష్క దంపతుల గారాలపట్టి వామికను ఉద్దేశించి సోషల్‌మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ టీమిండియా కెప్టెన్‌కు బాసటగా నిలిచారు. కోహ్లి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ట్విటర్‌ వేదికగా స్పందించారు. 'డియర్‌ విరాట్‌.. కొందరు మనుషులు పూర్తిగా ద్వేషంతో నిండిపోయి ఉంటారు. ఎందుకంటే వారికి ఎవ్వరూ ప్రేమను పంచరు. వాళ్లను క్షమించు. జట్టును కాపాడుకో' అంటూ మంగళవారం ట్వీట్‌ చేశారు. రాహుల్‌ గాంధీ చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం వైరలవుతోంది. 

కాగా, అభం శుభం తెలియని చిన్నారి వామికను టార్గెట్‌ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని నెటిజన్లు ఖండిస్తున్నారు. ఆటగాళ్లు రాణించకపోతే వారి కుటుంబసభ్యులను దూషించడం, వారిని టార్గెట్ చేయడం మంచిది కాదని హితవు పలుకుతున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోహ్లికి అండగా నిలబడటాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ అంశంపై మహిళా కమీషన్‌ ఇవాళ ఢిల్లీ పోలీసులకు నోటీసులు పంపింది. కేసుకు సంబంధించిన పురోగతిపై ఆరా తీసింది. నిందితులను త‍్వరలోనే పట్టుకోవాలని ఆదేశించింది. కోహ్లి కుటుంబానికి బెదిరింపులు వచ్చినట్లు మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా సుమోటో కేసు నమోదైంది. 
చదవండి: Virat Kohli- Vamika: కోహ్లి కూతురిపై విషం చిమ్మిన నెటిజన్‌.. ఛీ ఇంతకు దిగజారుతారా?

మరిన్ని వార్తలు