కేఎల్‌ రాహుల్‌కు కోహ్లి వార్నింగ్‌!

15 Oct, 2020 18:45 IST|Sakshi

ఈసారి ఒకటికి రెండుసార్లు ఆలోచించు

షార్జా:  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటివరకూ కింగ్స్‌ పంజాబ్‌ సాధించిన విజయం ఏదైనా ఉందంటే అది ఆర్సీబీపైనే.  గత నెల 24వ తేదీన ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 97 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 206 పరుగులు చేయగా,  ఆ తర్వాత ఆర్సీబీ 17 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. ఆ మ్యాచ్‌లో రాహుల్‌ 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో అజేయంగా 132 పరుగులు సాధించి జట్టు ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, ఇక్కడ రాహుల్‌ ఇచ్చిన రెండు క్యాచ్‌లను కోహ్లి వదిలేయడంతో రాహుల్‌ రెచ్చిపోయి ఆడాడు. దాంతో భారీ సెంచరీని రాహుల్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఇలా కోహ్లి క్యాచ్‌లు వదిలేయడంపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా ఇరుజట్లు సెకండ్‌ లెగ్‌ మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. (‘కోహ్లి, ఏబీని ఐపీఎల్‌ నుంచి నిషేధించండి’)

అయితే ఈసారి రాహుల్‌కు ఆ చాన్స్‌ ఇవ్వనని అంటున్నాడు కోహ్లి. పనిలో పనిగా రాహుల్‌కు ఒక వార్నింగ్‌ కూడా ఇచ్చేశాడు. ఈసారి బంతిని రాహుల్‌ హిట్‌ చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని రాహుల్‌ను హెచ్చరించాడు కోహ్లి. పూమా ఇండియా నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లో పాల్గొన్న వీరిద్దరూ సరద సరదాగా వ్యాఖ్యానించారు. తనకు అవకాశం వస్తే గనుక వీరిద్దరిపై నిషేధం విధించాలని ఐపీఎల్‌ నిర్వాహకులను కోరతానంటూ రాహుల్‌ సరదా కామెంట్‌ చేశాడు. అంతే కాకుండా ఈసారి కూడా ఆర్సీబీ ఫీల్డర్లు కొన్ని క్యాచ్‌లను వదిలేస్తారని ఆశిస్తున్నా అంటూ జోక్‌ చేశాడు. దానికి కోహ్లి కూడా తనదైన శైలిలో చమత్కరించాడు. గత మ్యాచ్‌లో తానేదో వదిలేశానంటూనే, ఈసారి కూడా అక్కడే ఫీల్డింగ్‌ చేస్తానన్నాడు. ఈసారి బంతిని హిట్‌ చేయడానికి రాహుల్‌ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తే మంచిదన్నాడు.

>
మరిన్ని వార్తలు