Ramcharan On Kohli Biopic: విరాట్‌ కోహ్లి బయోపిక్‌లో రామ్‌చరణ్‌..? పోలికలు కూడా దగ్గరగా ఉన్నాయి..!

18 Mar, 2023 09:31 IST|Sakshi

తాజాగా ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్‌ సందర్భంగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఓ ఆసక్తికర విషయాన్ని మీడియాతో షేర్‌ చేసుకున్నాడు. RRR సినిమాతో గ్లోబల్‌ స్టార్‌గా మారిపోయిన చెర్రీ.. స్పోర్ట్స్ బయోపిక్‌లో నటించాలని తనకు చాలకాలంగా కోరిక ఉందని అన్నాడు. అవకాశం వస్తే టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లి బయోపిక్‌లో నటించేందుకు ఇష్టపడతానని తెలిపాడు.

క్రీడా జగత్తులో విరాట్‌ కోహ్లి ఓ అద్భుతమని, అతనిదో స్ఫూర్తిదాయకమైన క్యారెక్టరని పొగడ్తలతో ముంచెత్తిన చరణ్‌.. కోహ్లి రోల్‌ ప్లే చేసే అవకాశం వస్తే మాత్రం వదులుకునేది లేదని తన మనసులోని మాటను బయటపెట్టాడు. లుక్స్‌ పరంగా కూడా తాను కోహ్లికి దగ్గరగా ఉంటానని, ఇది తనకు అదనపు అడ్వాంటేజ్‌ అని తెలిపాడు.

వెండితెరపై ఇప్పటికే వైవిధ్యమైన పాత్రలను పోషించి సక్సెస్‌ సాధించిన చరణ్‌.. స్పోర్ట్స్ బయోపిక్ చేయాలన్న సాహసోపేతమైన కోరిక కలిగి ఉండటం సినీ జనాలకు ఆకట్టుకుంటుంది. కాంక్లేవ్‌ సందర్భంగా చరణ్‌.. ఆస్కార్‌ విన్నింగ్‌ నాటు నాటు పాటకు స్టెప్పులేసి అలరించాడు.

ఓ పక్క చరణ్‌.. కోహ్లి బయోపిక్‌లో నటించాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టగా, మరో పక్క కోహ్లి.. ఆసీస్‌తో తొలి వన్డే సందర్భంగా మైదానంలో నాటు నాటు పాటకు స్టెప్పులేసి పరోక్షంగా చరణ్‌ ప్రపోజల్‌కు అంగీకారం తెలిపాడు.

కాగా, నాటు నాటు పాటకు ఆస్కార్‌ అందుకున్న తర్వాత అమెరికా నుంచి నేరుగా ఢిల్లీకి వచ్చిన రామ్‌ చరణ్‌.. తండ్రి చిరంజీవితో కలిసి కేంద్ర మంత్రి అమిత్‌ షాను కలిశాడు. చరణ్‌ పాల్గొన్న కాంక్లేవ్‌లోనే పాల్గొన్న అమిత్‌ షా.. సదస్సు అనంతరం అదే హోటల్‌లో బస చేస్తున్న చరణ్‌ రూమ్‌ కి వెళ్లి కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా నాటు నాటు పాటకు ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్నందుకు గానూ అమిత్‌షా అభినందించి చరణ్‌ను శాలువాతో సత్కరించారు.

అనంతరం ట్వీట్‌ చేసిన కేంద్రమంత్రి అమిత్‌ షా భారతీయ చిత్రసీమలో ఇద్దరు దిగ్గజాలు చిరంజీవి, రామ్‌ చరణ్‌లను కలవడం ఆనందంగా ఉందని తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమ.. భారతదేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు