Suved Parkar Ranji Debut: రహానే స్థానంలో అరంగేట్రం.. డబుల్‌ సెంచరీతో కొత్త చరిత్ర; ఎవరీ సువేద్‌ పార్కర్‌

7 Jun, 2022 16:22 IST|Sakshi

రంజీ క్రికెట్‌ అంటే దేశవాలీలో ఎనలేని క్రేజ్‌. ఎందుకంటే టీమిండియాలోకి రావాలంటే ఏ ఆటగాడైనా తన ఆటేంటో రంజీల్లో రుచి చూపించాల్సిందే. ఇప్పుడంటే ఐపీఎల్‌ లాంటి లీగ్స్‌ వల్ల యువ క్రికెటర్లు ఎందరో వస్తున్నారు కానీ.. ఒకప్పుడు రంజీ ట్రోపీయే ఎందరో ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చింది. తాజాగా రంజీ ట్రోపీలో భాగంగా ముంబై, ఉత్తరాఖండ్‌ మధ్య రెండో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబైకి ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది.


ఓపెనర్లు పృథ్వీ షా(21), యశస్వి జైశ్వాల్‌(35)లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అప్పుడు క్రీజులోకి వచ్చాడు సువేద్ పార్కర్.. పేరు కొత్తగా వింటున్నప్పటికి రహానే స్థానంలో ముంబై తరపున రంజీ ట్రోపీలో అరంగేట్రం చేశాడు. గాయంతో దూరమైన రహానే విలువ తెలియకుండా బ్యాటింగ్‌ కొనసాగించిన సువేద్‌ పార్కర్‌ డెబ్యూ మ్యాచ్‌లోనే డబుల్‌ సెంచరీతో అదరగొట్టాడు. దురదృష్టవశాత్తూ రనౌట్‌ అయిన సువేద్‌ పార్కర్‌.. తాను ఔటయ్యే వరకు నిలకడైన ఆటతీరుతో అదరగొట్టాడు. 447 బంతుల్లో 21 ఫోర్లు, 4 సిక్సర్లతో 252 పరుగులు చేశాడు.

రంజీల్లో ముంబై తరపున అరంగేట్రం మ్యాచ్‌లోనే డబుల్‌ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా సువేద్‌ పార్కర్‌ చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు ముంబై ప్రస్తుత కోచ్‌ అమోల్‌ మజుందార్‌ మాత్రమే ఈ ఘనత సాధించాడు. ముంబై తరపున 1993-94 రంజీ సీజన్‌లో హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో 260 పరుగులు సాధించి చరిత్ర సృష్టించాడు. తాజాగా ఆ రికార్డును సువేద్‌ పార్కర్‌  బ్రేక్‌ చేశాడు.

ఇక సువేద్‌ పార్కర్‌ దాటికి ముంబై తొలి ఇన్నింగ్స్‌ను  వికెట్ల నష్టానికి 647 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. సువేద్‌తో పాటు సర్ఫరాజ్‌ ఖాన్‌ 153, ఆర్మాన్‌ జాఫర్‌ 60 పరుగులతో రాణించారు. చివర్లో షామ్స్‌ ములాని 59 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక గాయంతో రహానే రంజీ ట్రోపీకి దూరమైన సంగతి తెలిసిందే. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో మూడు, నాలుగు వారాలు రహానే రెస్ట్‌ అవసరం ఉంది. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. ఇక సువేద్‌ పార్కర్‌ 2001 ఏప్రిల్‌ 6న ముంబైలో జన్మించాడు. 

చదవండి: Sarfaraz Khan: అదరగొట్టిన సర్ఫరాజ్‌.. ట్రిపుల్‌ సెంచరీ, 2 డబుల్‌ సెంచరీలు, 3 సెంచరీలు!

మరిన్ని వార్తలు