Ranji Trophy 2022: క్రీడా మంత్రి పోరాటం వృధా.. భారీ ఆధిక్యం దిశగా మధ్యప్రదేశ్‌

16 Jun, 2022 18:55 IST|Sakshi

Bengal Vs Madhya Pradesh 1st Semi Final: రంజీ ట్రోఫీ 2022 సీజన్‌లో బెంగాల్‌ పోరాటం ముగిసేలా కనిపిస్తుంది. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్‌లో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగులకే ఆలౌట్‌ కావడంతో ప్రత్యర్ధికి 68 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. 5 వికెట్ల నష్టానికి 197 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన బెంగాల్‌ను సీనియర్‌ ఆటగాడు, ఆ రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్‌ తివారి (211 బంతుల్లో 12 ఫోర్లతో 102‌), బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ షాబాజ్‌ అహ్మద్‌ (209 బంతుల్లో 12 ఫోర్లతో 116‌) శతకాలతో ఆదుకున్నారు.

వీరిద్దరూ అద్భుతమైన పోరాటపటిమను కనబర్చి బెంగాల్‌ను తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దిశగా తీసుకెళ్లారు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరూ ఔటవ్వడంతో బెంగాల్‌ లీడ్‌ సాధించే అవకాశాన్ని కోల్పోయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మధ్యప్రదేశ్‌ను‌.. రజత్‌ పాటిదార్‌ (63 నాటౌట్‌), కెప్టెన్‌ ఆధిత్య శ్రీవత్సవ (34 నాటౌట్‌) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో భారీ ఆధిక్యం దిశగా తీసుకెళ్లారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి 231 పరుగుల ఓవరాల్‌ ఆధిక్యాన్ని సాధించింది. నాలుగో రోజు ఆటలో మధ్యప్రదేశ్‌ మరో 150, 200 పరుగులు చేసినా, తొలి ఇన్నింగ్స్‌ ఆధారంగా ఫైనల్‌కు చేరుకుంటుంది. 

స్కోర్‌ వివరాలు:
మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ 341 ఆలౌట్‌
బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌ 273 ఆలౌట్‌
మధ్యప్రదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌ 163/2
చదవండి: న్యూజిలాండ్‌ జట్టులో కల్లోలం.. మరో స్టార్‌ క్రికెటర్‌కు కరోనా

మరిన్ని వార్తలు