Ranji Trophy-2022: ఆంధ్రాపై ముంబై ఘన విజయం..

16 Dec, 2022 12:39 IST|Sakshi

సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీ క్రికెట్‌ టోర్నీ సీజన్‌ను 41 సార్లు చాంపియన్‌ ముంబై జట్టు ఘనవిజయంతో శుభారంభం చేసింది. ఆంధ్ర జట్టుతో ఇక్కడ జరిగిన ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’ తొలి లీగ్‌ మ్యాచ్‌లో అజింక్య రహానే సారథ్యంలోని ముంబై జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి ఆరు పాయింట్లు సంపాదించింది.

ఓవర్‌నైట్‌ స్కోరు 290/6తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ ఆట కొనసాగించిన ముంబై మరో 41 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయి 331 పరుగులవద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ అర్మాన్‌ జాఫర్‌ (116; 16 ఫోర్లు, 1 సిక్స్‌) అదే స్కోరు వద్ద అవుటవ్వగా... తనుష్‌ కొటియన్‌ (63; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ చేశాడు.

ఆంధ్ర బౌలర్లలో షోయబ్‌ నాలుగు వికెట్లు తీయగా... శశికాంత్, లలిత్‌ మోహన్‌లకు మూడు వికెట్ల చొప్పున లభించాయి. 93 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆంధ్ర జట్టు 47 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది.

ఉప్పర గిరినాథ్‌ (27; 6 ఫోర్లు), రికీ భుయ్‌ (16; 2 ఫోర్లు), కెప్టెన్‌ విహారి (14), నితీశ్‌ రెడ్డి (15; 3 ఫోర్లు) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ముంబై బౌలర్లలో తుషార్‌ (3/34), తనుష్‌ (2/18), సిద్ధార్థ్‌ (2/26) రాణించారు. 39 పరుగుల విజయలక్ష్యాన్ని ముంబై 6.1 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి ఛేదించింది.
చదవండి: PKL 2022: ఫైనల్‌కు దూసుకెళ్లిన పింక్‌ పాంథర్స్.. తుది పోరులో పుణేతో ఢీ

మరిన్ని వార్తలు