Ranji Trophy: రహానే సేన చేతిలో హైదరాబాద్‌ పరాజయం

23 Dec, 2022 05:24 IST|Sakshi

 ఇన్నింగ్స్‌ 217 పరుగుల తేడాతో ముంబై ఘనవిజయం

ముంబై: తమిళనాడుతో తొలి మ్యాచ్‌లో వెలుతురులేమితో ఓటమిని తప్పించుకున్న హైదరాబాద్‌ జట్టు రెండో మ్యాచ్‌లో మాత్రం దారుణ పరాజయాన్ని చవిచూసింది. రంజీ ట్రోఫీ టైటిల్‌ను 41 సార్లు సాధించిన ముంబై జట్టుతో జరిగిన గ్రూప్‌ ‘బి’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో తన్మయ్‌ అగర్వాల్‌ సారథ్యంలోని హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ 217 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్‌ మూడో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 173/6తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన హైదరాబాద్‌ మరో 41 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయి 214 పరుగుల వద్ద ఆలౌటైంది.

ముంబై ఎడంచేతి వాటం స్పిన్నర్‌ షమ్స్‌ ములానీ (7/94) హైదరాబాద్‌ను దెబ్బ తీశాడు. 437 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం పొందిన ముంబై... హైదరాబాద్‌కు ఫాలోఆన్‌ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ హైదరాబాద్‌ విఫలమై 67.2 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. తన్మయ్‌ (39; 5 ఫోర్లు, 1 సిక్స్‌), రాహుల్‌ బుద్ధి (65; 10 ఫోర్లు, 1 సిక్స్‌), తనయ్‌ త్యాగరాజన్‌ (39 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. షమ్స్‌ ములానీ (4/82), తనుష్‌ కొటియాన్‌ (5/82) ముంబై విజయంలో కీలకపాత్ర పోషించారు.

మరిన్ని వార్తలు