రషీద్‌ ఖాన్‌కు బంపర్‌ ఆఫర్‌; టీ20 ప్రపంచకప్‌ టార్గెట్‌గా

7 Jul, 2021 10:04 IST|Sakshi

కాబుల్‌: అఫ్గానిస్థాన్ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌కు బంపర్‌ ఆఫర్‌ తగిలింది. రానున్న టీ20 ప్రపంచకప్‌ టార్గెట్‌గా రషీద్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. యూఏఈ, ఒమన్ వేదికగా ఈ ఏడాది అక్టోబరు 17 నుంచి నవంబర్‌ 14 వరకు టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. రషీద్ ఖాన్ చేతికి టీ20 టీమ్ పగ్గాలిచ్చినట్లు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది.

ఇక టీ 20 వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్థాన్ గ్రూప్-బిలో ఉండగా.. ఆ గ్రూప్‌లో భారత్, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా లాంటి అగ్రజట్లు ఉన్నాయి. వాస్తవానికి 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత రషీద్ ఖాన్‌ని మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా నియమించింది. అతని కెప్టెన్సీలో 16 వన్డేలాడిన అఫ్గానిస్థాన్ ఆరింట్లో విజయం సాధించింది. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల రిత్యా రషీద్ ఖాన్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించిన బోర్డు అస్గర్ అఫ్గాన్‌ని కెప్టెన్‌గా నియమించింది.

ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతుండడంతో మళ్లీ రషీద్‌కు పగ్గాలు అప్పజెప్పాలని భావించింది. అయితే మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరించిన రషీద్ ఎట్టకేలకి బోర్డు పెద్దల జోక్యంతో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక వన్డే, టెస్టు టీమ్ కెప్టెన్‌గా హస్మతుల్లా షాహిది సెలెక్ట్ అయ్యాడు. ఇక ఇటీవలే ప్రైవేట్‌ టీ20 ఆడడానికి లండన్‌ చేరుకున్న రషీద్‌ ఐసీసీ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌- 2లో కొనసాగుతున్నాడు. 

మరిన్ని వార్తలు