రోహిత్‌ డబుల్‌ సెంచరీపై ట్వీట్‌ చేసి డిలీట్‌ చేసిన అశ్విన్‌‌

28 Mar, 2021 17:48 IST|Sakshi

పూణే: ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ డబుల్‌ హండ్రెడ్‌ సాధిస్తాడని ఊహించి ముందుగా ట్వీట్‌ చేసిన టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. 37 పరుగుల వద్ద రోహిత్‌ అవుటవ్వడంతో ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశాడు. ప్రస్తుత వన్డే సిరీస్‌లో ఒక్క భారీ ఇన్నింగ్స్‌ కూడా నమోదు చేయని రోహిత్‌.. ఈ మ్యాచ్‌లో మంచి టచ్‌లో ఉన్నట్టు కనిపించాడు. బంతిని చక్కగా మిడిల్‌ చేస్తూ చూడచక్కని షాట్లతో(6 ఫోర్లు) అలరించాడు. దీంతో ఈ మ్యాచ్‌లో రోహిత్‌.. కెరీర్‌లో నాలుగో డబుల్‌ సెంచరీని సాధిస్తాడని, టీమిండియా 400 పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేస్తుందని అశ్విన్‌ ట్వీట్‌ చేశాడు. అయితే రోహిత్‌.. అశ్విన్‌ నమ్మకాన్ని వమ్ము చేస్తూ, ఆదిల్‌ రషీద్‌ వేసిన గూగ్లీకి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.   

కాగా, సిరీస్‌లో వరుసగా మూడోసారి టాస్‌ ఓడిపోయిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. ప్రత్యర్ధి కెప్టెన్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు అంగీకరించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ స్థానంలో నటరాజన్‌ రంగప్రవేశం చేశాడు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, ధవన్‌ శుభారంభాన్ని అందించి, తొలి వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 37 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద రోహిత్‌ను రషీద్‌ బోల్తా కొట్టించగా, ధవన్‌(56 బంతుల్లో 67; 10 ఫోర్లు) చూడచక్కని షాట్లతో హాఫ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే వరుస ఓవర్లలో ధవన్‌, కోహ్లి(10 బంతుల్లో 7), రాహుల్‌(18 బంతుల్లో 7) వికెట్లు కోల్పోవడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఆతరువాత క్రీజ్‌లో వచ్చిన పంత్(62 బంతుల్లో 78; 5 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు)‌, హార్ధిక్‌(44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) లు చెలరేగి ఆడారు. ఆఖర్లో టెయిలెండర్లు వరుసగా వికెట్లు కోల్పోవడంతో టీమిండియా 48.2 ఓవర్లలో 329 పరుగుల వద్ద ఆలౌటైంది. 

మరిన్ని వార్తలు