Ravi Shastri: Had No Say Dropping Ambati Rayudu In 2019 World Cup Squad: రవిశాస్త్రి... 2017లో టీమిండియా హెడ్ కోచ్గా పగ్గాలు చేపట్టాడు. ఆయన హయాంలో టీమిండియా చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించింది. రవిశాస్త్రి హెడ్కోచ్గా ఉన్న సమయంలో 43 టెస్టులు ఆడిన భారత జట్టు 25 గెలవగా.. ఐదింటిని డ్రా చేసుకుంది. ఇక 76 వన్డేల్లో సాధించిన విజయాలు 51. పొట్టి ఫార్మాట్ విషయానికొస్తే... అరవై ఐదింట.. 43 విజయాలు. మొత్తంగా 184 మ్యాచ్లలో 119 గెలుపొందింది. విజయాల శాతమే ఎక్కువగా ఉన్నా... ఐసీసీ ట్రోఫీ గెలవలేదన్న లోటు మాత్రం అలాగే ఉండిపోయింది.
ముఖ్యంగా 2019లో వన్డే వరల్డ్కప్లో ఎన్నో అంచనాలతో బరిలోకి టీమిండియా కనీసం ఫైనల్కు కూడా చేరకపోవడం తీవ్రంగా నిరాశపరిచింది. అంతేగాక జట్టు సెలక్షన్ విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. తెలుగు క్రికెటర్ అంబటి రాయుడును కాదని.. విజయ్ శంకర్ను ఎంపిక చేయడం విమర్శలకు తావిచ్చింది. ఇక టీ20 వరల్డ్కప్-2021 టోర్నీ ముగిసిన తర్వాత హెడ్కోచ్ పదవి నుంచి తప్పుకొన్న రవిశాస్త్రి తాజాగా ఈ విషయాల గురించి మాట్లాడారు.
టైమ్స్ ఆఫ్ ఇండియాతో సంభాషించిన ఆయన... ‘‘2019 వరల్డ్కప్... జట్టు ఎంపిక విషయం గురించి నాకు పెద్దగా ఫిర్యాదులు లేవు. అయితే, ప్రపంచకప్ కోసం ముగ్గురు వికెట్ కీపర్లను సెలక్ట్ చేయడం సరికాదనిపించింది. నిజానికి అంబటి(అంబటి రాయుడు) లేదంటే శ్రేయస్ అయ్యర్ జట్టులోకి రావాల్సింది. ఎంఎస్ ధోని, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్.. వికెట్ కీపర్ బ్యాటర్లు ఇంతమంది ఎందుకు అనిపించింది.
కానీ సెలక్టర్ల నిర్ణయంలో నేను ఎక్కువగా జోక్యం చేసుకోలేదు. సాధారణ చర్చల్లో భాగంగా... ఫీడ్బాక్ అడిగినపుడు మాత్రమే కొన్ని విషయాలు చెప్పేవాడిని’’ అని పేర్కొన్నాడు. కాగా 2019లో జరిగిన వన్డే వరల్డ్కప్ సమయంలో... అద్భుత ఫామ్లో ఉన్న అంబటి రాయుడి కాదని, విజయ్ శంకర్ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీంతో విమర్శలు రాగా.... విజయ్ త్రీ డైమన్షనల్ ఆటగాడని అందుకే అతన్ని సెలెక్ట్ చేసినట్లు(బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) అప్పటి సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన రాయుడు అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి.. ఆనక తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.