Ravi Shastri Slams BCCI And ICC, Says Players Do Not Run On petrol: టీమిండియా హెడ్ కోచ్గా రవిశాస్త్రి శకం టీ20 ప్రపంచకప్-2021తో ముగిసింది. మెగా టోర్నీలో భాగంగా నవంబర్ 8న నమీబియాతో జరిగిన మ్యాచ్కు రవిశాస్త్రి చివరిసారిగా కోచింగ్ సేవలను అందించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా పసికూన నమీబియాపై ఘన విజయం సాధించి కోచ్గా రవిశాస్త్రికి, టీ20 కెప్టెన్గా విరాట్ కోహ్లికి ఘనంగా వీడ్కోలు పలికింది. మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన రవిశాస్త్రి.. బీసీసీఐ, ఐసీసీలపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత ప్రపంచకప్లో టీమిండియా వైఫల్యాలపై మాట్లాడుతూ.. అందుకు పరోక్ష కారణమైన బీసీసీఐ, ఐసీసీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.
గత ఆరు నెలలుగా బయోబబుల్లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు ఫిజికల్గా, మెంటల్గా అలసిపోయారని.. ఆటగాళ్లు కూడా మనుషులే అన్న విషయాన్ని క్రికెట్ బోర్డులు, అభిమానులు గుర్తించాలని అన్నాడు. ఊపిరి సడలనంత బిజీ షెడ్యూల్ను ప్రిపేర్ చేసి ఐసీసీ, బీసీసీఐలు టీమిండియా వైఫల్యాలకు పరోక్ష కారణమయ్యాయని ధ్వజమెత్తాడు. ప్రపంచకప్కు ముందు ఏ జట్టైనా తాజాగా ఉండాలని కోరుకుంటుంది. కానీ, భారత ఆటగాళ్ల విషయంలో అలా జరగలేదని, టోర్నీ షెడ్యూల్ చేయడానికి ముందు ఐసీసీ ఈ ఆలోచన చేసి ఉండాల్సిందని ఆగ్రహించాడు.
పెట్రోల్ పోసి నడపడానికి టీమిండియా ఆటగాళ్లు యంత్రాలు కాదని తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఇదిలా ఉంటే, రవిశాస్త్రి 2014లో తొలిసారి టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. అతని ఆధ్వర్యంలో భారత జట్టు 2019 వన్డే ప్రపంచ కప్లో సెమీ ఫైనల్కు, 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్స్కు చేరుకుంది. రవిశాస్త్రి హయాంలో ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు సార్లు టెస్ట్ సిరీస్లు గెలిచిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. ఆసీస్తో పాటు సేన(SENA) దేశాలైన సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లను టీమిండియా వారి స్వదేశాల్లో మట్టికరిపించింది.
చదవండి: మాకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ ధన్యవాదాలు..