Ravindra Jadeja: టీమిండియా ఓటమి.. ఆసుపత్రిలో చేరిన జడేజా

29 Aug, 2021 13:56 IST|Sakshi

లీడ్స్‌: ఇంగ్లండ్‌తో జరిగిన మూడోటెస్టులో ఓటమిపాలైన టీమిండియాకు మరోషాక్‌ తగిలింది. టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఆసుపత్రిలో చేరాడు. దీనికి సంబంధించిన ఫోటోను జడేజా మ్యాచ్‌ ముగియగానే అభిమానులతో పంచుకున్నాడు. దీంతో జడేజాకు ఏమైందో అని అభిమానులు కంగారు పడ్డారు. విషయంలోకి వెళితే.. లీడ్స్ టెస్టులో రెండో రోజు (గురువారం) ఫీల్డింగ్ చేస్తుండగా.. జడేజా మోకాలి గాయం తిరగబెట్టింది.

దాంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా టీమిండియా మేనేజ్‌మెంట్ అతని గాయానికి స్కానింగ్ చేయించినట్లు తెలిసింది. స్కానింగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నాలుగో టెస్టులో జడేజా ఆడటంపై క్లారిటీ రానుంది. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం నాలుగో టెస్టుకు జడేజా స్థానంలో అశ్విన్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి.

చదవండి: 'నేస్తమా త్వరగా కోలుకో..': సచిన్‌


కాగా మ్యాచ్‌లో 32 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 2 వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా.. బ్యాటింగ్‌లోనూ నిరాశపరిచాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతను 34 పరుగులు మాత్రమే చేశాడు. లీడ్స్ టెస్టు విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌ని ఇంగ్లాండ్ 1-1తో సమం చేయగా.. నాలుగో టెస్టు మ్యాచ్‌ ఓవల్ వేదికగా సెప్టెంబరు 2 నుంచి ప్రారంభంకానుంది. ఇక శనివారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా పేలవ ప్రదర్శన కనబరిచింది. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది.

చదవండి: ENG Vs IND: ఇన్నింగ్స్‌ ఓటముల్లో టీమిండియా చెత్త రికార్డు

మరిన్ని వార్తలు