Ravindra Jadeja: రెండు పదాలతోనే ట్వీట్‌.. అభిమానుల్లో అంతులేని సంతోషం

23 Jan, 2023 13:32 IST|Sakshi

టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జట్టుకు దూరమై ఐదు నెలలు కావొస్తుంది. గతేడాది ఆసియా కప్‌లో భాగంగా మోకాలి గాయంతో జడ్డూ టీమిండియాకు దూరమయ్యాడు. అనంతరం బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో రీహాబిలిటేషన్‌ సెంటర్‌లో ఉన్న జడేజా మోకాలికి వైద్యులు సర్జరీ నిర్వహించారు. అప్పటి నుంచి విశ్రాంతి తీసుకున్న జడేజా తాజాగా కోలుకొని రంజీ ట్రోఫీ ఆడేందుకు చెన్నైకు వచ్చాడు. సౌరాష్ట్ర తరపున తమిళనాడుతో చివరి రౌండ్‌ మ్యాచ్‌ ఆడనున్నాడు. కాగా ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో మొదలవనున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం జడేజాను బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. 

ఇక చెన్నైలో ఉన్న జడేజాకు ఈ ప్లేస్‌తో మంచి అనుబంధం ఉందన్న సంగతి ‍ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్‌లో జడేజా చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సుదీర్ఘకాలంగా సీఎస్కేతో కొనసాగుతూ జట్టు విజయాల్లో జడ్డూ  కీలక పాత్ర పోషించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.  చాలా రోజుల తర్వాత చెన్నైకి రావడంతో జడేజా తన ట్విటర్‌లో అభిమానులకు..''వణక్కం చెన్నై(నమస్కారం చెన్నై)'' అంటూ విష్‌ చేశాడు. కేవలం రెండు పదాలతోనే ట్వీట్‌ చేయడం సీఎస్‌కే అభిమానులను సంతోషపెట్టింది.

ఈ క్రమంలో జడేజా ట్వీట్ కు చెన్నై జట్టు అభిమానులు ఉత్సాహంగా స్పందిస్తున్నారు.''జడేజాకు చెన్నై స్వాగతం పలుకుతోంది. సీఎస్‌కే అభిమాన ప్లేయర్ నువ్వు'' అని ఒక అభిమాని పేర్కొనాడు. ''నా అభిమాన రోల్ మోడల్కు వణక్కమ్. మైదానంలోకి తిరిగి సింహం అడుగు పెడుతోంది'' అని మరొక అభిమాని  కామెంట్ చేశాడు.  ''చెన్నై సూపర్ కింగ్స్‌కు తిరిగి స్వాగతం.. జడ్డూ నీ రాకింగ్ ప్రదర్శన కోసం వేచి చూస్తున్నాం..'' అంటూ కొందరు కామెంట్లు పెట్టారు.

చదవండి: ఫుట్‌బాల్‌ చరిత్రలోనే తొలిసారి..

ఆర్‌సీబీకి షాక్‌.. ట్విటర్‌ను కూడా వదల్లేదు

మరిన్ని వార్తలు