Ravi Shastri : కుర్రాళ్లు కష్టపడ్డారు.. అందుకే ఈ ఫలితం

14 May, 2021 16:13 IST|Sakshi

ముంబై: ''మన కుర్రాళ్లు సరైన సమయంలో కష్టపడ్డారని అందుకే ఈరోజు టెస్టుల్లో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నామంటూ'' టీమిండియా హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఐసీసీ గురువారం విడుదల చేసిన వార్షిక టెస్టు టీమ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా 121 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా రవిశాస్త్రి తన ఆనందాన్ని పంచుకున్నాడు.'టీమిండియా ధృడమైన సంకల్పం, స్థిరమైన ప్రదర్శన వల్లే సుదీర్ఘ ఫార్మాట్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగలిగాం. ర్యాంకింగ్స్​కు సంబంధించి నిబంధనలను ఐసీసీ మధ్యలో మార్చింది. అయినప్పటికీ.. సవాళ్లను అధిగమిస్తూ తిరిగి నంబర్​ వన్​ ర్యాంకును పొందాం. ఆటగాళ్లు కఠిన పరిస్థితుల్లో కఠిన క్రికెట్​ ఆడారు. జట్టు విజయాల పట్ల.. ఆటగాళ్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. మన కుర్రాళ్లు కష్టపడ్డారు కాబట్టే ఈరోజు ఈ ఫలితం ' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో  120 రేటింగ్‌తో న్యూజిలాండ్‌ రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టిన ఇంగ్లండ్‌ (109 రేటింగ్‌) మూడో స్థానంలో నిలిచింది. మే 2020 నుంచి ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లకు 100 శాతం... అంతకుముందు రెండేళ్లలో జరిగిన మ్యాచ్‌లకు 50 శాతం పాయింట్ల ఆధారంగా జట్లకు ఐసీసీ రేటింగ్స్‌ను కేటాయించింది. ఇందులో భారత్‌ 24 మ్యాచ్‌ల్లో 2,914 పాయింట్లు సాధించగా... రెండో స్థానంలో నిలిచిన కివీస్‌ 18 మ్యాచ్‌ల్లో 2,166 పాయింట్లను తమ ఖాతాలో వేసుకుంది. జూన్‌ 18 నుంచి 22 వరకు టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది. ఇక 2017 నుంచి భారత జట్టుకు రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా సేవలందిస్తున్నాడు. 2019 వరల్డ్ కప్ తర్వాత మరోసారి అతని పదవికాలాన్ని పొడిగించారు. 
చదవండి: ICC Rankings: టాప్‌లో టీమిండియా.. దక్షిణాఫ్రికా చెత్త రికార్డు

టీమిండియా చీటింగ్‌ చేసి సిరీస్‌ గెలిచింది: పైన్‌

మరిన్ని వార్తలు