ఆర్సీబీతో మ్యాచ్‌: ఢిల్లీ ఛేదించేనా?

2 Nov, 2020 21:11 IST|Sakshi

అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో  ఆర్సీబీ 153 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. దేవదూత్‌ పడిక్కల్‌(50; 41 బంతుల్లో 5 ఫోర్లు) రాణించడంతో పాటు విరాట్‌  కోహ్లి(29; 24 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), డివిలియర్స్‌(35; 21 బంతుల్లో 1 ఫోర్‌, 2సిక్స్‌లు) లు ఫర్వాలేదనిపించడంతో ఆర్సీబీ గౌరవప్రదమైన స్కోరు చేసింది. టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిట్సల్‌ పీల్డింగ్‌ ఎంచుకోవడంతో ఆర్సీబీ బ్యాటింగ్‌కు దిగింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను  జోష్‌ ఫిలెప్పి,  పడిక్కల్‌లు ఆరంభించారు. కాగా, జట్టు స్కోరు 25 పరుగుల వద్ద ఉండగా ఫిలెప్పీ(12) పెవిలియన్‌ చేరాడు. రబడా వేసిన ఐదో ఓవర్‌ తొలి బంతికి ఫిలెప్పి ఔటయ్యాడు. అనంతరం ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను పడిక్కల్‌- కోహ్లిలు చక్కదిద్దారు. వికెట్లు కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చిన ఈ జోడి ఆచితూచి ఆడింది. 

ఈ జోడి 57 పరుగులు జత చేసిన తర్వాత కోహ్లి రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ వేసిన 13 ఓవర్‌ మూడో బంతికి భారీ షాట్‌ ఆడిన కోహ్లి.. స్టోయినిస్‌ క్యాచ్‌ పట్టడంతో ఔటయ్యాడు. ఆ తరుణంలో క్రీజ్‌లోకి వచ్చిన డివిలియర్స్‌ సమయోచితంగా ఆడాడు. ఈ క్రమంలోనే పడిక్కల్‌తో కలిసి 40 పరుగులు జత చేశాడు. అయితే నోర్జే వేసిన 16 ఓవర్‌ నాల్గో బంతికి పడిక్కల్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ ఓవర్‌ చివరి బంతికి  క్రిస్‌ మోరిస్‌ డకౌట్‌ అయ్యాడు. చివర్లో డివిలియర్స్‌, శివం దూబే(17; 11 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌)లు బ్యాట్‌ ఝుళిపించడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో నోర్జే మూడు వికెట్లు సాధించగా, రబడా రెండు వికెట్లు తీశాడు. అశ్విన్‌కు వికెట్‌ దక్కింది.
 

మరిన్ని వార్తలు