ఏబీ, దూబేలు దుమ్ములేపారు..

28 Sep, 2020 21:16 IST|Sakshi

దుబాయ్‌: ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌, శివం దూబేలు మెరుపులు మెరిపించారు. స్లాగ్‌ ఓవర్లలో వీరిద్దరూ ధాటిగా ఆడటంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. డివిలియర్స్‌ 24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 పరుగులు చేశాడు. కోహ్లి ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన డివిలియర్స్‌ భారీ షాట్లతో  అలరించాడు. ఈ క‍్రమంలోనే  23 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. బుమ్రా, బౌల్ట్‌ వంటి బౌలర్లున్నా 360 డిగ్రీల ఆటతో అదరగొట్టాడు. ఆఖరి ఓవర్‌లో దూబే(27 నాటౌట్‌; 10 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు) బ్యాట్‌ ఝుళిపించడంతో ఆర్సీబీ 202 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. అంతకుముందు అరోన్‌ ఫించ్‌(52; 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), దేవదూత్‌ పడిక్కల్‌(54; 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మంచి ఆరంభాన్ని అందించారు. (చదవండి: అయ్యో కోహ్లి.. తీరు మారలేదు)

టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ ఫీల్డింగ్‌ తీసుకోవడంతో ఆర్సీబీ బ్యాటింగ్‌కు దిగింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను ఫించ్‌, పడిక్కల్‌లు ధాటిగా ఆరంభించారు.  వీరిద్దరూ తొలి వికెట్‌కు 81 పరుగులు చేశారు. ఈ క్రమంలోనే ఫించ్ రాణించగా, అతనికి జతగా పడిక్కల్‌ కూడా ఆకట్టుకున్నాడు. కాగా, బౌల్ట్‌ బౌలింగ్‌లో పొలార్డ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఫించ్‌ ఔట్‌ కాగా, ఆపై కాసేపటికి కోహ్లి ఔటయ్యాడు. దాంతో ఆర్సీబీ 92 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆ సమయంలో పడిక్కల్‌కు డివిలియర్స్‌ జత కలవడంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించిన తర్వాత పడిక్కల్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత డివీ-దూబేలు బౌండరీల మోత మోగించారు. ప్రధానంగా చివరి ఓవర్‌లో దూబే మూడు సిక్స్‌లు కొట్టడంతో ఆర్సీబీ స్కోరు 200 మార్కును దాటింది. ముంబై బౌలర్లలో బౌల్ట్‌ రెండు వికెట్లు సాధించగా, రాహుల్‌ చహర్‌కు వికెట్‌ దక్కింది.(చదవండి: తెవాటియా.. ఐయామ్ వెరీ సారీ: మాజీ చీఫ్‌ సెలక్టర్‌)

>
Poll
Loading...
మరిన్ని వార్తలు