IND Vs AUS: 'కమిన్స్‌ వస్తే బాగుండు'.. నాలుగో టెస్టుకు కూడా కెప్టెన్‌గా స్మిత్‌

5 Mar, 2023 14:46 IST|Sakshi

టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా ఫుల్‌ జోష్‌లో ఉంది. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ వ్యక్తిగత కారణాల రిత్యా స్వదేశానికి వెళ్లిపోవడంతో స్టీవ్‌ స్మిత్‌ స్టాండిన్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. స్మిత్‌ సారధ్యంలో ఇండోర్‌లో ఆసీస్‌ తన ప్రదర్శనతో అదరగొట్టింది. టీమిండియా బ్యాటర్లను తమ స్పిన్‌ ఉచ్చులో బిగించి ముప్పతిప్పలు పెట్టింది.

ఇక ఒకప్పుడు కెప్టెన్‌గా సక్సెస్‌ అయిన స్మిత్‌ తాజా విజయంతో మరోసారి తన కెప్టెన్సీని నిరూపించుకున్నాడు. అయితే అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న నాలుగో టెస్టుకు కూడా స్మిత్‌ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. స్వదేశానికి వెళ్లిన పాట్‌ కమిన్స్‌ గురించి ఇంతవరకు ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. ఒకవేళ కమిన్స్‌ తిరిగిరాకపోతే మాత్రం​ మరోసారి స్మిత్‌ జట్టును నడిపించనున్నాడు. అయితే క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈ విషయాన్ని అధికారికంగా ద్రువీకరించాల్సి ఉంది. 

''స్వదేశానికి వెళ్లిన కమిన్స్‌ ఇప్పటికే తిరిగి రాలేదు. అతని కుటుంబం ప్రస్తుతం సమస్యలో ఉంది. దానికోసమే అతను వెళ్లాడు. నాలుగో టెస్టు ప్రారంభం అయ్యేలోగా తిరిగి వస్తాడని అనుకుంటున్నాం.'' అంటూ క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రతినిధి మెక్‌డొనాల్డ్‌ పేర్కొన్నాడు.

అయితే మూడో టెస్టు విజయం అనంతరం స్టాండిన్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''నా టైం అయిపోయింది. మూడో టెస్టు వరకు మాత్రమే నేను జట్టు కెప్టెన్‌ను. ఇప్పడు ఇది పాట్‌ కమిన్స్‌ జట్టు. అతను లేని వారంలో జట్టు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంది. కానీ మ్యాచ్‌లో మా ప్రదర్శనతో దానిని అధిగమించాం. అతను తిరిగి వస్తాడని అనుకుంటున్నా'' అంటూ తెలిపాడు. 

అహ్మదాబాద్‌ వేదికగా మార్చి 9 నుంచి 13 వరకు జరగనున్న నాలుగో టెస్టుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆస్ట్రేలియా మూడోటెస్టు విజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌ టీమిండియాకు చాలా కీలకం. మ్యాచ్‌ గెలిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెడుతుంది. ఒకవేళ ఓడినా లేదా డ్రా చేసుకున్నా ఇతర మ్యాచ్‌ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది.

చదవండి: 'చిన్నప్పుడు నువ్వు పెద్ద టార్చ్‌బేరర్‌..'

కంటతడి పెట్టిన సానియా మీర్జా

మరిన్ని వార్తలు