Neeraj Chopra-BCCI: నీరజ్‌ చోప్రా 'జావెలిన్‌'కు భారీ ధర.. దక్కించుకుంది ఎవరంటే?

2 Sep, 2022 17:00 IST|Sakshi
Neeraj Chopra(ఫైల్‌ ఫోటో)

భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్‌లో అథ్లెట్‌ విభాగంలో తొలి పతకం.. వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన రెండో అథ్లెట్‌గా నీరజ్‌ చోప్రా చరిత్ర సృష్టించాడు. తాజాగా అతను టోక్యో ఒలింపిక్స్‌లో వాడిన జావెలిన్‌ను ఈ-వేలంలో బీసీసీఐ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. నీరజ్‌ జావెలిన్‌ను దాదాపు రూ.1.5 కోట్ల బిడ్‌తో బీసీసీఐ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 

కాగా టోక్యో ఒలింపిక్స్‌ ముగిసిన అనంతరం భారత​ ప్రధాని టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన తన నివాసానికి మర్యాద పూర్వకంగా ఆహ్వానించి అథ్లెట్లను ఘనంగా సన్మానించారు. ఈ నేపథ్యంలోనే నీరజ్‌ చోప్రా.. ప్రధాని మోదీకి ఒక జావెలిన్‌ను అందజేశాడు. దీనితో పాటు మరికొందరు అథ్లెట్లు కూడా తమ వస్తువులను ప్రధాని మోదీకి కానుకగా ఇచ్చారు.


మహిళా బాక్సర్‌ లవ్లీనా బొర్హంగైన్‌

పతకాలతో దేశ​ఖ్యాతిని ఇనుమడింపచేసిన క్రీడాకారులకు చెందిన వస్తువులను వేలం వేయాలని ప్రధాని భావించారు. వేలం ద్వారా వచ్చిన డబ్బును ''నమామి గంగే'' కార్యక్రమానికి ఉపయోగించాలని ప్రధాని తీర్మానించారు. కాగా 2014లో గంగా నది పరిరక్షణ, పరిశుభ్రంగా ఉంచాలనే సంకల్పంతో ప్రధాని మోదీ నమామి గంగే కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. కాగా కోవిడ్‌-19 తొలి దశలో బీసీసీఐ పీఎం కేర్‌ ఫండ్స్‌కు రూ. 50 కోట్లు విరాళం ఇచ్చి తన పెద్ద మనసును చాటుకుంది. ఇక గతేడాది సెప్టెంబర్‌- అక్టోబర్‌లో నీరజ్‌ చోప్రా జావెలిన్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లకు చెందిన వస్తువులకు ఈ-వేలం నిర్వహించారు.


ఫెన్సర్‌ భవానీ దేవీ

తాజాగా ఈ-వేలానికి సంబంధించిన వివరాలు వెల్లడించగా.. నీరజ్‌ చోప్రా జావెలిన్‌కు భారీ స్థాయిలో పోటీ ఏర్పడగా.. చివరకు బీసీసీఐ రూ. 1.5 కోట్లు బిడ్‌ వేసి దక్కించుకున్నట్లు సమాచారం. అలాగే మహిళా ఫెన్సర్‌ భవానీ దేవి వాడిని ఖరవాలానికి రూ 1.25 కోట్ల ధర పలకడం విశేషం. అలాగే పారాలింపియన్‌ సుమిత్‌ అంటిల్‌ జావెలిన్‌ను రూ. 1.002 కోట్లకు మరొక సంస్థ సొంతం చేసుకుంది.


సుమిత్‌ అంటిల్‌

అలాగే టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన మహిళా బాక్సర్‌ లవ్లీనా బొర్హంగైన్‌ బాక్సింగ్‌ గ్లోవ్స్‌ రూ. 91 లక్షలకు అమ్ముడయ్యాయి. ఓవరాల్‌గా ఈ-వేలానికి దాదాపు 8600 బిడ్స్‌ రావడం విశేషం. ఇక ఇటీవలే నీరజ్‌ చోప్రా తాను స్వర్ణం గెలిచిన జావెలిన్‌ త్రోను లుసానే ఒలింపిక్‌ మ్యూజియానికి విరాళంగా ఇచ్చాడు. ఈ విషయాన్ని లుసానే ఒలింపిక్‌ మ్యూజియం నిర్వాహకులు తమ ట్విటర్‌లో అధికారికంగా ప్రకటించారు.

చదవండి: Neeraj Chopra: చిన్న గ్యాప్‌ మాత్రమే.. ప్రపంచ రికార్డుతో ఘనంగా రీఎంట్రీ

Serena Williams-Lebron James: G.O.A.T అని ఇలా కూడా పిలవొచ్చా.. వారెవ్వా!

మరిన్ని వార్తలు