IPL Media Rights E-Auction: రికార్డులు బద్దలు కొడుతున్న ఐపీఎల్‌ మీడియా రైట్స్‌.. 50వేల కోట్ల దిశగా

12 Jun, 2022 19:40 IST|Sakshi

ఐపీఎల్‌ మీడియా హక్కులకు సంబంధించిన ఈ-వేలం జోరుగా సాగుతుంది. 2023-2027 కాలానికి గాను ముంబైలో  బీసీసీఐ వేలం ప్రక్రియ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం  ముంబై లో ఇ-వేల ప్రారంభమైంది. నాలుగు ప్యాకేజీలుగా విభజించి వేలాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. ఐపీఎల్ మీడియా హక్కుల విలువ ఇప్పటికే రూ. 40 వేల కోట్లు దాటిందని తెలుస్తున్నది.  

ముందుగా ఉపఖండంలో టీవీ హక్కులు.. ఆ తర్వాత డిజిటల్  హక్కుల విభాగాలకు వేర్వేరుగా వేలం నిర్వహిస్తున్నారు. టీవీ ప్రసారం హక్కుల కోసం ఒక్కో మ్యాచ్ కు రూ. 49 కోట్లు బేస్ ప్రైజ్ గా నిర్ణయించగా.. డిజిటల్ హక్కులు రూ. 33 కోట్లుగా నిర్ణయించారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం టీవీ ప్రసార హక్కుల వేలం రూ. 24 వేల కోట్లు చేరిందని.. డిజిటల్ హక్కులు రూ. 19 వేల కోట్లు దాటాయని తెలుస్తున్నది. మొత్తానికి  ఇప్పటికే  ఐపీఎల్ మీడియా  హక్కుల విలువ రూ. 43 వేల కోట్లు దాటిందని  సమాచారం.   ఈ అంకె ప్రతి అరగంటకూ పెరుగుతున్నది.  ఈ-వేలం సోమవారం కూడా కొనసాగనుంది.  దీనిని బట్టి చూస్తే బీసీసీఐ పెట్టుకున్న టార్గెట్ (రూ. 50వేల కోట్లు) చేరుకోవడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు.

ప్రస్తుతం ఐపీఎల్ మీడియా  హక్కుల వేలంలో డిస్నీ స్టార్, సోనీ నెట్వర్క్, వయాకామ్ రిలయన్స్ 18, జీ, ఫన్ ఆసియా, సూపర్ స్పోర్ట్, టైమ్స్ ఇంటర్నెట్ లు పోటీలో ఉన్నాయి. 2017-2022 కాలానికి గాను (డిస్నీ స్టార్) మీడియా హక్కుల ప్రారంభ ధర రూ. 16 వేల కోట్లు కాగా ఇప్పుడది ఏకంగా డబుల్ (రూ. 32 వేల కోట్లు) అయింది.  పోటీ నుంచి అమెజాన్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు తప్పుకున్నా పోటీ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ఉంది.  ఇదే స్పీడ్ కొనసాగితే బీసీసీఐ.. రూ. 60 వేల కోట్లు అర్జించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

చదవండి: ఒడిశా ఎలా ఉంది?.. దక్షిణాఫ్రికా ఆటగాడి ఎపిక్‌ రిప్లై

మరిన్ని వార్తలు