IPL 2023: శ్రేయస్‌ అయ్యర్‌ దూరం.. కేకేఆర్‌ కెప్టెన్‌గా స్టార్‌ ఆల్‌రౌండర్‌!

24 Mar, 2023 17:41 IST|Sakshi

ఐపీఎల్‌-2023కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌, టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ దూరమైన సంగతి తెలిసిందే. వెన్ను గాయంతో బాధపడుతున్న అయ్యర్‌.. సర్జరీ కోసం లండన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఐపీఎల్‌తో పాటు వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌కు దూరం కానున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో కేకేఆర్‌ సారథిగా ఎవరు వ్యవహరిస్తున్నది అందరి మెదడులను తొలుస్తున్న ప్రశ్న.

కాగా కోల్‌కతా కెప్టెన్సీ రేసులో స్టార్‌ ఆల్‌రౌండర్లు షకీబ్‌ అల్‌ హసన్‌, సునీల్‌ నరైన్‌, రస్సెల్‌ ఉన్నారు. అయితే కేకేఆర్‌ టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం సునీల్‌ నరైన్‌ వైపే మెగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఐపీఎల్ చరిత్రలో అత్యంత అనుభవజ్ఞుడైన విదేశీ క్రికెటర్లలో సునీల్‌ నరైన్‌ ఒకడు. అతడు ఇప్పటివరకు ఐపీఎల్‌లో 148 మ్యాచ్‌లు ఆడాడు. అదే విధంగా కేకేఆర్‌ జట్టులో సీనియర్‌ ఆటగాడిగా కూడా నరైన్‌ ఉ‍న్నాడు.

అతడు కేకేఆర్‌ తరపున 170 వికెట్లు సాధించాడు. అదే విధంగా యూఏఈ టీ20 లీగ్‌లో కోల్‌కతా ప్రాంఛైజీ అబుదాబి నైట్ రైడర్స్ కెప్టెన్‌గా కూడా నరైన్‌ వ్యవహరించాడు. అయితే ఈ టోర్నీలో అబుదాబి నైట్ రైడర్స్ ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే విజయం సాధించింది.

అయినప్పటికీ నరైన్‌కు అనుభవం దృష్ట్యా అతడికే మరోసారి తమ జట్టు పగ్గాలు అప్పజెప్పాలని కేకేఆర్‌ జట్టు మేనేజ్‌మెంట్ తెలుస్తోంది. ఇక ఐపీఎల్‌-16వ సీజన్‌ మార్చి31 నుంచి ప్రారంభం కానుంది. కేకేఆర్‌ తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్‌1న పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది.
చదవండి: IPL 2023: ఐపీఎల్‌కు దూరమైనా పంత్‌కు అరుదైన గౌరవం.. ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక నిర్ణయం!

మరిన్ని వార్తలు