Virat Kohli: కోహ్లి తప్పుకున్నాడు సరే.. రోహిత్‌, రాహుల్‌ సంగతేంటి?

27 Dec, 2022 18:16 IST|Sakshi

టీమిండియా రన్‌మెషిన్‌ విరాట్‌ కోహ్లి.. కొంతకాలం టి20 క్రికెట్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంకతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు కోహ్లి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు బీసీసీఐ వర్గం ఒక ప్రకటనలో తెలిపింది. టి20లకు దూరంగా ఉండనున్న కోహ్లి వన్డేలు, టెస్టులకు మాత్రం అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడని తెలిపారు.

ఇది కోహ్లి తనకు తానుగా తీసుకున్న నిర్ణయమని.. ఎవరి బలవంతం లేదని స్పష్టం చేశారు. ఈ లెక్కన ఐపీఎల్‌ 2023 ప్రారంభమయ్యే వరకు కోహ్లి టి20లు ఆడడని అర్థమవుతుంది. ఐపీఎల్‌కు ముందు టీమిండియా ఆరు టి20 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ఇదే విషయమై బీసీసీఐ అధికారి ఒకరు స్పందించారు.

"అవును, టి20లకు అందుబాటులో ఉండనని కోహ్లి చెప్పాడు. వన్డే సిరీస్‌కు అతడు తిరిగి వస్తాడు. అయితే టి20ల నుంచి కొన్నాళ్లపాటు బ్రేక్‌ తీసుకుంటున్నాడా అన్న విషయం మాత్రం ఇంకా తెలియదు. అయితే ముఖ్యమైన సిరీస్‌లకు మాత్రం అతని పేరును పరిశీలనలో ఉంటుంది. రోహిత్ విషయానికి వస్తే అతని గాయంపై తొందరపడదలచుకోలేదు. అతడు ఫిట్‌గా ఉన్నాడా లేదా రానున్న రోజుల్లో నిర్ణయిస్తాం. అతడు బ్యాటింగ్ చేస్తున్నాడు కానీ రిస్క్‌ తీసుకోలేం" అని వెల్లడించారు.

ఇక టి20 వరల్డ్‌కప్‌లో టీమిండియా వైఫల్యం తర్వాత సీనియర్లను పొట్టి ఫార్మాట్‌ నుంచి తప్పించి హార్దిక్‌ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని పెద్ద ఎత్తున డిమాండ్స్‌ వచ్చాయి. అయితే ఈ ఏడాది జరిగిన టి20 వరల్డ్‌కప్‌లో టీమిండియా తరపున టాప్‌ స్కోరర్‌ విరాట్‌ కోహ్లియే కావడం విశేషం. మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికి కోహ్లి టి20ల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయంపై మిశ్రమ స్పందన వచ్చింది. ఫాంలో ఉన్న కోహ్లినే పొట్టి ఫార్మాట్‌ నుంచి బ్రేక్‌ తీసుకోవాలని చూస్తుంటే.. అసలు ఫామ్‌లో లేని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌లు కూడా తమకు తాముగా తప్పుకుంటే బాగుంటదని చాలా మంది అభిమానులు అభిప్రాయపడ్డారు. 

శ్రీలంకతో జరగబోయే మూడు టీ20ల సిరీస్‌కు కోహ్లి దూరం కానున్నాడు. మళ్లీ అదే టీమ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు మాత్రం తిరిగి రానున్నాడు. కోహ్లితోపాటు రాహుల్, రోహిత్‌ కూడా టి20 సిరీస్‌ వరకు బ్రేక్‌నిచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పాండ్యా‌కు కెప్టెన్సీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే గాయపడిన రోహిత్ శర్మ జనవరి 10 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌ సమయానికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాలని చూస్తున్నాడు. శ్రీలంకతో సిరీస్‌ కోసం జట్టు ఎంపిక బుధవారం జరిగే అవకాశం ఉంది.

ఇక శ్రీలంకతో టి20 సిరీస్‌ జనవరి 3న ముంబైలో మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జనవరి 5న పుణెలో రెండో టీ20, జనవరి 7న రాజ్‌కోట్‌లో మూడో టీ20 జరుగుతాయి. ఆ తర్వాత జనవరి 10, 12, 15 తేదీల్లో గువాహటి, కోల్‌కతా, త్రివేండ్రంలలో మూడు వన్డేలు జరుగుతాయి.

చదవండి: దెబ్బ అదుర్స్‌.. ఒక్క ఇన్నింగ్స్‌తో అన్నింటికి చెక్‌

ఘోర అవమానం.. బోరుమన్న రమీజ్‌ రాజా

మరిన్ని వార్తలు