ఐపీఎల్‌లో పాక్‌ క్రికటర్ల రీఎంట్రీ..?

25 Mar, 2021 21:20 IST|Sakshi

ముంబై: ఐపీఎల్‌ తొలి ఎడిషన్‌లో మాత్రమే ప్రాతినిధ్యం వహించిన పాక్‌ క్రికెటర్లు, ఆతర్వాత  వివిధ కారణాల చేత లీగ్‌కు దూరంగా ఉన్నారు. అయితే వారి 14 ఏళ్ల నిరీక్షణకు 2022 ఐపీఎల్‌ సీజన్‌లో తెరపడే అవకాశం కనిపిస్తోంది. భారత్‌, పాక్‌ల మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొని, చర్చలకు ఇరు దేశాధినేతలు అంగీకరించి, ఆ చర్చలు విజయవంతంగా ముగిస్తే.. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో పాక్‌ క్రికెటర్లు ఆడే అవకాశం ఉంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం పాక్‌ క్రికెటర్లు భారత్‌కు రానున్నారు. ఆతరువాత ఇరు దేశాల మధ్య టీ20 సిరీస్‌ జరుగుతందన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి.

కాగా, పాక్‌ ఆటగాళ్లు 2008లో తొలిసారిగా లీగ్‌లో పాల్గొన్నారు. ఇదే వారికి మొదటిది, ఆఖరిది‌. అప్పుడు 12 మంది పాక్‌ ఆటగాళ్ళు వివిధ ఫాంచైజీలకు ప్రాతినిధ్యం వహించారు. ఆ సీజన్‌లో మొత్తం 8 జట్లు పోటీలో ఉండగా, 5 జట్ల తరఫున 12 మంది పాక్‌ క్రికెటర్లు ప్రాతినిధ్యం వహించారు. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ యాజమాన్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ అత్యధికంగా నలుగురు పాక్‌ ఆటగాళ్లకు అవకాశం కల్పించగా, రాజస్థాన్ రాయల్స్ ముగ్గురిని, ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు చెరో ఇద్దరిని కొనుగోలు చేశాయి. హైదరాబాద్‌కు చెందిన డెక్కన్ చార్జర్స్ కు పాక్‌ చిచ్చరపిడుగు షాహిద్ అఫ్రిది ప్రాతినిధ్యం వహించారు.

ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన లెఫ్టార్మ్‌ ఫాస్ట్ బౌలర్ సోహైల్ తన్వీర్.. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో తన్వీర్ 4 ఓవర్లలో 14 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఆ రికార్డు ఐపీఎల్‌లో 11 ఏళ్ల పాటు అలానే కొనసాగింది. 2019 సీజన్‌లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వెస్టిండీస్ ఫాస్ట్‌ బౌలర్ అల్జారి జోసెఫ్, తన లీగ్‌ డెబ్యూ మ్యాచ్‌లోనే తన్వీర్‌ రికార్డును బద్దలు కొట్టాడు. హైదరాబాద్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో జోసెఫ్‌ 3.4 ఓవర్లలో 12 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని వార్తలు