రాబోయే టీ20 ప్రపంచకప్‌లో ఆయా జట్ల విజయావకాశాలపై ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ విశ్లేషణ

26 Jul, 2022 20:52 IST|Sakshi

Ricky Ponting: ఈ ఏడాది చివర్లో (అక్టోబర్‌, నవంబర్‌) జరిగే పొట్టి ప్రపంచకప్‌లో విజేత ఎవరనే అంశంపై చర్చ అప్పుడే మొదలైంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ ఆసక్తికర డిబేట్‌కు తెర లేపాడు. 2022 టీ20 వరల్డ్‌కప్‌ విజేత ఎవరో తేల్చేయడంతో పాటు ఫైనల్‌, సెమీఫైనల్స్‌కు చేరే జట్లను కన్ఫర్మ్‌ చేశాడు. అందుకు ఆయా జట్లకు గల అవకాశాలను, కారణాలను విశ్లేషించాడు. ఈసారి ప్రపంచకప్‌ గెలవాలంటే అదృష్టం కూడా కలిసిరావాలని అభిప్రాయపడ్డాడు.

హోమ్‌ అడ్వాంటేజ్‌తో పాటు పటిష్టమైన జట్టును కలిగిన ఆసీస్‌కే ఈ ఏడాది ప్రపంచకప్‌ గెలిచి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని జోస్యం చెప్పాడు. ఫైనల్లో టీమిండియాపై గెలిచి ఆసీస్‌ ప్రపంచ ఛాంపియన్‌ హోదాను నిలబెట్టుకుంటుందని అన్నాడు. ఫైనల్‌ రేసులో ఇంగ్లండ్‌ అవకాశాలను కూడా కొట్టిపారేయలేమంటూనే.. భారత్‌, ఇంగ్లండ్‌, ఆసీస్‌లలో ఏ జట్టు ఫైనల్‌కు చేరినా అంతిమ విజయం మాత్రం ఆసీస్‌దేనని గొప్పలు పోయాడు.

ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌ను మించిన జట్టు లేదంటూనే.. ఆ జట్టుకు కొన్ని బలహీనతలు ఉన్నాయని తెలిపాడు. ఆ జట్టు వైట్ బాల్ కోచ్ మాథ్యూ మాట్‌ గైడెన్స్‌ను ఈ సందర్భంగా కొనియాడాడు. ఫైనల్‌ ఫోర్‌లో నాలుగో జట్టుగా సౌతాఫ్రికాకు అవకాశం ఉందని అన్నాడు. పాక్‌, న్యూజిలాండ్‌లు కూడా బలమైన బృందాన్నే కలిగినప్పటికీ.. ఆ జట్లకు అదృష్టం కలిసిరాదని అభిప్రాయపడ్డాడు. 
చదవండి: టీమిండియా మెంటల్‌ హెల్త్‌ కోచ్‌గా మళ్లీ అతనే..!

మరిన్ని వార్తలు