IPL 2023: శ్రేయస్‌ అయ్యర్ దూరం..! కేకేఆర్ కొత్త కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్!

16 Mar, 2023 13:22 IST|Sakshi

ఐపీఎల్-2023 ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌, టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉంది. గత కొంతకాలంగా వెన్నునొప్పి సమస్యతో బాధపడుతూ, శస్త్ర చికిత్స సైతం చేయించుకున్న అయ్యర్‌.. అహ్మదాబాద్‌ టెస్ట్‌ సందర్భంగా అతడి గాయం తిరగబెట్టింది.

దీంతో అతడు స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. అతడు వెన్ను గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టనున్నట్లు భారత క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే అయ్యర్‌ ఐపీఎల్‌ సీజన్‌ మొత్తానికి దూరం కానున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో కేకేఆర్ కు కొత్త సారథి ఎవరన్న చర్చ నడుస్తోంది. ఈ ఏడాది సీజన్‌లో కేకేఆర్‌ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్‌ రింకూ సింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కేకేఆర్‌ షేర్‌ చేసిన ఓ వీడియో ఈ వార్తలకు మరింత ఊతమిస్తుంది. రింకూ సింగ్ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో కేకేఆర్‌ షేర్‌ చేసింది.

 ఈ వీడియోకు కేకేఆర్ అభిమాని ఒకరు.. ‘గేమ్ ఛేంజర్ రింకూ..’అని రాసుకొచ్చాడు. దానికి కేకేఆర్ రిప్లై ఇస్తూ.. ‘మా ​కెప్టెన్‌ అని రాసుకొచ్చింది. కానీ.. వెంటనే ఆ కామెంట్‌ని డిలీట్ చేసింది. ఇక​ ఇప్పటి వరకు 17 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన రింకూ కేవలం 251 పరుగులు మాత్రమే చేశాడు. అయితే రింకూ సింగ్‌కు మాత్రం పవర్‌ హిట్టర్‌ అనే పేరు ఉంది. కాగా ప్రస్తుత కేకేఆర్‌ జట్టులో టిమ్‌ సౌథీ. సునీల్‌ నరైన్‌, రస్సెల్‌ వంటి సీనియర్‌ ఆటగాళ్లు కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నారు. అయితే వీరిలో అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.

A post shared by Kolkata Knight Riders (@kkriders)

చదవండిWTC Final:డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కేఎల్‌ రాహుల్‌ వద్దు.. భరత్‌ సరైనోడు

మరిన్ని వార్తలు