ధోని వారసుడు పంత్‌ మాత్రమే

6 Oct, 2020 16:09 IST|Sakshi

ఢిల్లీ : ఐపీఎల్‌ 13వ సీజన్‌ సీరియస్‌గా సాగుతున్న వేళ టీమిండియా మాజీ బౌలర్‌ ఆశిష్‌ నెహ్రా ఆసక్తికర ప్రతిపాదనతో ముందుకొచ్చాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు ఎంఎస్‌ ధోని గుడ్‌బై చెప్పి ఆరు సంవత్సరాలైపోయింది. ఈ ఆరు సంవత్సరాల్లో ధోని లాంటి ఆటగాడు మరొకరు రాకపోవడం.. ఒకవేళ వచ్చిన అడపా దడపా జట్టులోకి వచ్చిపోతుండడం చేస్తున్నారు. ఈ ఆరేళ్లలో టీమిండియా తన టెస్టు జట్టులో వృద్ధిమాన్‌ సాహా, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌ లాంటి ఆటగాళ్లను ప్రయత్నించింది. వీరిలో ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు  ఇన్నింగ్స్‌లతో మెరిసేవారే గాని నిలకడగా ఆడిన సందర్భాలు చాలా తక్కువ. అందుకే ఇప్పటికీ టెస్టు జట్టులో వికెట్‌కీపర్‌ స్థానం సుస్థిరంగా లేదు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో ధోని స్థానాన్ని భర్తీ చేసే సత్తా రిషబ్‌ పంత్‌కు ఉందంటూ.. అతని వారసుడు పంత్‌ మాత్రమేనని ఆశిష్‌ నెహ్రా అంటున్నాడు. ఇదే విషయమై టీమిండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నట్లు పేర్కొన్నాడు. (చదవండి : పేరు మాత్రమే పంత్‌.. కానీ పనులు మాత్రం)

'ఇప్పుడు మనం ఏ ఫార్మాట్‌ గురించి మాట్లాడుతున్నామనేది ముఖ్యం కాదు. బంగర్ చెప్పిన మాటలను నేను పూర్తిగా సమర్థిస్తాను. రిషబ్ పంత్‌ను టీమిండియాలో ఆడించాలని కోరుకుంటున్నా. ఈ ఐపీఎల్‌లో అతను మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్‌ ద్వారా పంత్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రతి ఆటగాడికి మద్దతు అనేది చాలా అవసరం 'అని తెలిపాడు.  

అంతకముందు స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో టీమిండియా సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఐపీఎల్‌లో పంత్ ప్రారంభించిన విధానం చాలా బాగుందన్నారు. లెఫ్ట్ హ్యాండర్, వికెట్ కీపర్‌గా రాణిస్తున్న పంత్.. టీమిండియా మిడిల్ ఆర్డర్‌ను బ్యాలెన్సింగ్ చేయడానికి సరిగా సరిపోతాడని అన్నారు. టీమిండియా మిడిల్ ఆర్డర్‌లో ఎక్కువగా రైట్ హ్యాండర్స్ ఉన్నారని చెప్పారు. టీమిండియా మిడిల్ ఆర్డర్‌లో లెఫ్ట్ హ్యాండర్ ఉండటం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. (చదవండి : ఇలా అయితే కష్టం పృథ్వీషా!)

ప్రస్తుతం రిషబ్‌ పంత్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున ఐపీఎల్‌ సీజన్‌లో మంచి ఆటతీరు కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌లో 171 పరుగులు చేశాడు. కాగా, టీమిండియా తరఫున 13 టెస్ట్‌లు, 16 వన్డేలు, 28 టీ-20లు ఆడిన పంత్‌ను పలువురు ధోని వారసుడిగా అభివర్ణిస్తున్నారు. అయితే టీమిండియా తరఫున నిలకడగా రాణించడంలో పంత్ విఫలమవుతున్నాడు. 

>
మరిన్ని వార్తలు