Rishabh Pant: నిలకడగా రిషబ్‌ పంత్‌ ఆరోగ్యం

1 Jan, 2023 07:36 IST|Sakshi

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీమ్‌ఇండియా వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని.. అతడు వేగవంతంగా కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. శ్రీలంకతో సిరీస్‌కు దూరమైన పంత్‌.. కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఉత్తరాఖండ్‌ వెళ్తుండగా.. అతడు ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టిన విషయం తెలిసిందే.

ఈ ఘటనలో పంత్‌ నుదిటితో పాటు, మోకాలు, వీపు భాగంలో గాయాలయ్యాయి. పంత్‌కు చిన్న ప్లాస్టిక్‌ సర్జరీ చేసినట్లు ఢిల్లీ క్రికెట్‌ సంఘం డైరెక్టర్‌ శ్యామ్‌ శర్మ తెలిపాడు. ‘ఢిల్లీ నుంచి ఓ బృందం డెహ్రాడూన్‌లోని దవాఖానకు వెళ్లి రిషబ్‌ పంత్‌ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. ప్లాస్టిక్‌ సర్జారీ అవసరం కావడంతో అక్కడే వైద్యం అందించారు. బీసీసీఐ నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నది’ అని ఆయన అన్నారు.

అయితే రిషభ్‌ పంత్‌ ఇప్పట్లో మళ్లీ బ్యాట్‌ పట్టి మైదానంలో బరిలోకి దిగే అవకాశాలు కనిపించడంలేదు.కారు ప్రమాదంలో 25 ఏళ్ల పంత్‌ కుడి కాలి లిగ్మెంట్‌ స్థానభ్రంశం అయింది. పంత్‌ నుదురు భాగంలో, కుడి చేతి మణికట్టు వద్ద, వీపు భాగంలో, చీలమండకూ గాయాలయ్యాయి. రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో క్రీడా గాయాల విభాగానికి చెందిన డాక్టర్‌ కమర్‌ ఆజమ్‌ మాట్లాడుతూ పంత్‌ గాయాల నుంచి పూర్తిస్థాయిలో కోలుకోవడానికి కనీసం మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని వివరించారు. కుడి కాలి లిగ్మెంట్‌ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే పంత్‌ కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశముందని ఆయన అన్నారు.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో ఆ్రస్టేలియాతో స్వదేశంలో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌కు పంత్‌ దూరం కానున్నాడు. ఆ తర్వాత ఏప్రిల్‌–మే నెలలో జరిగే ఐపీఎల్‌ టి20 టోరీ్నలో కూడా పంత్‌ ఆడేది అనుమానమే. ఐపీఎల్‌ టోర్నీలో పంత్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటి వరకు పంత్‌ 33 టెస్టులు ఆడి ఐదు సెంచరీలు, 11 అర్ధ సెంచరీల సహాయంతో 2,271 పరుగులు చేశాడు. అంతేకాకుండా 30 వన్డేల్లో, 66 టి20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.  

చదవండి: తప్పుడు వార్తలు.. తాగి నడిపితే 200 కిమీ దూరం ఎలా వస్తాడు!

మరిన్ని వార్తలు