ICC T20 World Cup 2022 Promo: టీ20 వరల్డ్‌కప్ ప్రోమోలో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా టీమిండియా వికెట్ కీపర్

10 Jul, 2022 17:58 IST|Sakshi

టీ20 వరల్డ్ కప్ 2022 కౌంట్‌డౌన్‌ (97 రోజులు) మొదలైన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఆదివారం (జులై 10) ఓ ప్రోమోను విడుదల చేసింది. ఇందులో టీమిండియా యువ వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఈ వీడియోలో భారీ అవతారంలో దర్శనమిచ్చిన పంత్‌.. సిడ్నీ హార్భర్‌లో నుంచి ఉద్భవించి అక్కడి వీధుల గుండా గాడ్జిల్లాలా నడుచుకుంటూ వెళ్తాడు. వెల్‌కమ్‌ టు బిగ్‌ టైమ్‌, పంత్‌ అంటూ ఐసీసీ దీనికి క్యాప్షన్‌ జోడించింది. 

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. పంత్‌ను హైలైట్‌ చేయడంపై అతని ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. గతకొంతకాలంగా మెగా ఈవెంట్ల ప్రోమోల్లో టీమిండియా తరఫున విరాట్‌ కోహ్లి మాత్రమే దర్శనమిచ్చేవాడు. అయితే కోహ్లిపై అంచనాలు తగ్గడంతో ఐసీసీ పంత్‌ను హైలైట్‌ చేస్తూ వీడియోను రూపొందించినట్లు తెలుస్తోంది. 

ఐసీసీ తాజా ప్రోమోలో పంత్‌తో పాటు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌, పాక్ క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్, విండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ స్టోయినిస్, పాక్ బౌలర్ షాహీన్‌ ఆఫ్రిది దర్శనమిచ్చారు. ఈ వీడియోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కనిపించకపోవడం విశేషం. కాగా, అక్టోబర్‌ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
చదవండి: ఇంగ్లాండ్‌తో టీ20 మ్యాచ్‌.. ప్లేయర్స్‌, ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసిన ధోని

మరిన్ని వార్తలు