Asia Cup 2022: కోహ్లి, రోహిత్‌ అయిపోయారు.. ఇప్పుడు పంత్‌, జడేజా వంతు

26 Aug, 2022 19:48 IST|Sakshi
Photo Credit: BCCI Twitter

ఆసియాకప్‌లో భాగంగా ఆగస్టు 28న పాకిస్తాన్‌, టీమిండియా మధ్య హైవోల్టేజ్‌ మ్యాచ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. మ్యాచ్‌కు ఇంకా రెండురోజులు మాత్రమే మిగిలి ఉండడంతో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో జోరు పెంచారు. ఎలాగైనా పాకిస్తాన్‌పై గెలిచి టి20 ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత్‌ భావిస్తోంది.

కాగా ప్రాక్టీస్‌లో భాగంగా శుక్రవారం ఉదయం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, రన్‌మెషిన్‌ విరాట్‌ కోహ్లిలు అర్షదీప్‌ సింగ్‌, అశ్విన్‌, జడేజా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. తాజాగా పంత్‌, జడేజాలు కూడా తమ బ్యాట్‌కు పనిచెప్పారు. ముఖ్యంగా పంత్‌ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇటీవలే పంత్‌ బ్యాటింగ్‌లో నిలకడగా రాణిస్తూ అన్ని ఫార్మాట్లలో కీలక ప్లేయర్‌గా మారిపోయాడు. ఇక ఆల్‌రౌండర్‌ జడేజా కూడా తన బ్యాటింగ్‌కు పదును పెట్టాడు. దాదాపు 30 నిమిషాల పాటు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేసిన జడేజా తన ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో అలరించాడు. ఈ వీడియోనూ బీసీసీఐ స్వయంగా షేర్‌ చేసింది. దీనిపై అభిమానులు ఫన్నీగా స్పందింస్తూ.. ''పొద్దున రోహిత్‌, కోహ్లి అయిపోయారు.. ఇప్పుడు జడేజా, పంత్‌ వంతు వచ్చింది.''అంటూ పేర్కొన్నారు. 

మరోవైపు పాకిస్తాన్‌ మాత్రం వరుస గాయాలతో సతమతమవుతుంది. ఇప్పటికే ఆ జట్టు స్టార్‌ పేసర్‌ షాహిన్‌ అఫ్రిది మోకాలి గాయంతో ఆసియాకప్‌కు దూరం కాగా.. తాజాగా మహ్మద్‌ వసీమ్‌ వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు తేలడంతో టీమిండియాతో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఇక బాబర్‌ ఆజం నేతృత్వంలోని పాక్‌ జట్టు కూడా పేపర్‌పై బలంగానే కనిపిస్తుంది. దీంతో ఇరుజట్ల మధ్య హోరాహోరిగా మ్యాచ్‌ జరగడం ఖాయంగా కనబడుతోంది.

చదవండి: IND Vs PAK Asia Cup 2022: పాక్‌తో మ్యాచ్‌.. రోహిత్‌తో కలిసి ఓపెనర్‌గా కోహ్లి!

షాట్లతో అలరించిన రోహిత్‌, కోహ్లి! మరీ ఇంత హైప్‌ అవసరం లేదు!

మరిన్ని వార్తలు