Rishabh Pant: టెస్ట్‌ల్లో టీమిండియా తరఫున వేగవంతమైన హాఫ్‌ సెంచరీ

13 Mar, 2022 18:23 IST|Sakshi

Rishabh Pant Scores Fastest 50 For India In Test Cricket: టీమిండియా వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్‌ల్లో టీమిండియా తరఫున ఫాస్టెస్ట్‌ ఫిఫ్టి కొట్టిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. శ్రీలంకతో జరుగుతున్న పింక్‌బాల్‌ టెస్ట్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో పంత్‌ కేవలం 28 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు కపిల్‌ దేవ్‌ (1982లో పాక్‌పై 30 బంతుల్లో) పేరిట ఉండేది. తాజాగా పంత్‌ కపిల్‌ రికార్డును బద్దలు కొట్టాడు. గతేడాది టీమిండియా ఆల్‌రౌండర్‌ శార్ధూల్‌ ఠాకూర్‌ కూడా పంత్‌ తరహాలో ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. ఓవల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శార్దూల్‌ 31 బంతుల్లో ఫిఫ్టి బాదాడు. ఇక 2008లో సెహ్వాగ్‌ ఇంగ్లండ్‌పై 32 బంతుల్లో హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు.

ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. 47 ఓవర్లు ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి ఓవరాల్‌గా 342 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపును ఆపడం దాదాపుగా అసాధ్యం. తొలి రోజు ఆటలో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌట్‌ కాగా, శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఇదే స్కోర్‌ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. ఇన్నింగ్స్‌ ప్రారంభమైన ఐదు ఓవర్లలోనే మిగిలిన 4 వికెట్లు కోల్పోయి 109 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా (5/24) ఐదేయగా, అశ్విన్‌ (2/30), షమీ (2/18), అక్షర్‌ (1/21)లు రాణించారు. 
చదవండి: IND VS SL 2nd Test Day 2: ఐదేసిన బుమ్రా.. కుప్పకూలిన శ్రీలంక

మరిన్ని వార్తలు