శతక్కొట్టిన పంత్‌.. ఫిఫ్టీతో ఆకట్టుకున్న గిల్‌

13 Jun, 2021 16:39 IST|Sakshi

సౌతాంప్టన్‌: ఇంగ్లండ్ పిచ్‌లకి టీమిండియా డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ రిషబ్ పంత్ తొందరగానే అలవాటుపడినట్లు కనిపిస్తోంది. ఈ నెల 3న సౌతాంప్టన్‌కి చేరుకున్న భారత క్రికెటర్లు.. గత మూడు రోజులుగా ప్రాక్టీస్ సెషన్స్‌లో బిజీగా గడుపున్నారు. ఈ క్రమంలో నిన్న భారత బృందం రెండు జట్లుగా విడిపోయి ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఇందులో రిషబ్ పంత్ అద్భుత శతకంతో (94 బంతుల్లోనే 121 పరుగులు) అజేయంగా నిలువగా, యువ ఓపెనర్ శుభమన్ గిల్ అర్ధశతకంతో (135 బంతుల్లో 85 పరుగులు) రాణించాడు. వీరిద్దరి ధాటికి సహచర బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోగా, ఇషాంత్ శర్మ(3/36) ఒక్కడే పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు వికెట్లు దక్కించుకున్నాడు. ఈ స్కోర్‌కు సంబంధించిన వివరాలను బీసీసీఐ తమ అధికారిక ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. అయితే, ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఎంత స్కోరు చేశారన్న విషయాన్ని బీసీసీఐ ప్రకటించలేదు.

ఇదిలా ఉంటే, 2018లో మొదటిసారి ఇంగ్లండ్‌లో పర్యటించిన రిషబ్ పంత్.. సూపర్‌ సెంచరీతో తనను తాను ప్రూవ్‌ చేసుకున్నాడు. తాజాగా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లోనూ శతక్కొట్టడంతో ఇంగ్లండ్‌ పిచ్‌లపై అతని రికార్డు మరింత మెరుగుపడింది. భారత్, న్యూజిలాండ్ మధ్య సౌథాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు జరుగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ నేపథ్యంలో.. పంత్‌ ఫామ్‌లోకి రావడం భారత జట్టులో ఉత్సాహాన్ని నింపుతుంది. కాగా, డబ్యూటిసీ ఫైనల్‌ తర్వాత భారత్‌.. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్యలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది.
చదవండి: India vs Sri Lanka: రేపటి నుంచి ధవన్ సేన క్వారంటైన్ షురూ

మరిన్ని వార్తలు