Rishabh Pant: వైరల్‌గా మారిన రిషబ్‌ పంత్‌ చర్య

15 Mar, 2023 17:50 IST|Sakshi

టీమిండియా క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ గతేడాది డిసెంబర్‌లో కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం నుంచి పంత్‌ త్వరగానే కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పంత్‌ షేర్‌ చేసిన వీడియో చూస్తుంటే అతను గాయాల నుంచి చాలా వరకు కోలుకున్నట్లు కనిపిస్తోంది.

తాజాగా పంత్‌ స్విమ్మింగ్ పూల్‌లో నడుస్తున్న వీడియోనూ షేర్‌ చేశాడు. పూల్‌లోనే చేతి కర్ర సాయంతో అటూ ఇటూ నడిచాడు. కాళ్లపై బలాన్ని పెట్టేందుకే పూల్‌లో  నడిచినట్లు అర్థమవుతుంది. "చిన్న విషయాలు, పెద్ద విషయాలు, మధ్యలో జరుగుతున్న అన్నింటికీ నేను రుణపడి ఉన్నాను. వీటన్నింటిని ఒకే స్టెప్‌లో తీసుకుంటున్నా" అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. గాయం తర్వాత పంత్ మోకాలికి కూడా సర్జరీ జరిగిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం పంత్‌ కోలుకుంటున్నాడు. గతంలో ఆరుబయట నడుస్తున్న ఫొటోను షేర్ చేసిన పంత్.. తాజాగా స్విమ్మింగ్ పూల్ లో నడుస్తూ తన కాళ్లలో బలాన్ని మరింత పెంచుకుంటున్నాడు. గతేడాది డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్తూ కారు ప్రమాదంలో తీవ్రం గాయపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతనికి ముంబైలో రెండు సర్జరీలు జరిగాయి.అప్పటి నుంచి తన పరిస్థితిని వివరిస్తూ ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. 

పంత్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు. దీంతో ఐపీఎల్ కు పూర్తిగా దూరమయ్యాడు. ఈ ఏడాది చివర్లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ లో కూడా ఆడతాడో లేదో తెలియని పరిస్థితి. ఈ మధ్యే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పంత్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన కేఎస్‌ భరత్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

A post shared by Rishabh Pant (@rishabpant)

చదవండి: వరుస ఓటములు బాధిస్తున్నా.. ఆకట్టుకున్న ఆసీస్‌ క్రికెటర్‌

'#Rest In Peace.. పాకిస్తాన్‌ క్రికెట్‌'

మరిన్ని వార్తలు