IND Tour Of BAN 2022: పంత్‌కు గాయం.. బంగ్లా టూర్‌కు దూరం!

30 Nov, 2022 18:18 IST|Sakshi

టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నాడా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. న్యూజిలాండ్‌తో మూడో వన్డే సందర్భంగా తాను ఔటైన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లో వెన్నునొప్పితో ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. స్ట్రెచర్‌పై పడుకున్న పంత్‌ ఫోటోలు లీక్‌ కావడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే పంత్‌ గాయం తీవ్రత తెలుసుకునేందుకు స్కానింగ్‌ పంపించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో డిసెంబర్‌ 4 నుంచి మొదలుకానున్న బంగ్లాదేశ్‌ టూర్‌కు రిషబ్‌ పంత్‌ వెళ్లేది అనుమానంగానే ఉంది. మరి అతని స్థానంలో ఎవరినైనా ఎంపిక చేస్తారా లేక పంత్‌ను ఆడిస్తారా అనేది చూడాలి. 

ఇక పంత్‌ బ్యాటింగ్‌ వైఫల్యంపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ని అవకాశాలిచ్చినా పంత్‌ తన బ్యాటింగ్‌ తీరును మాత్రం మార్చుకోవడం లేదు. పైగా ఇప్పుడు జట్టకు వైస్‌ కెప్టెన్‌ హోదాలో ఉన్నాడు. కనీసం ఆ బాధ్యతతోనైనా జాగ్రత్తగా ఆడతాడనుకుంటే పేలవ షాట్లతో వికెట్‌ను సమర్పించుకుంటున్నాడు. తాజాగా కివీస్‌తో మూడో వన్డేలో 10 పరుగులు మాత్రమే చేసిన పంత్‌ మరోసారి నిర్లక్ష్యంగా ఆడి వికెట్‌ పారేసుకున్నాడు.

పంత్‌ స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశమివ్వాలని అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు. ఎలా చూసుకున్నా పంత్‌ కంటే శాంసన్‌ స్రైక్‌రేట్‌ చాలా బాగుంది. ఇక చివరి ఐదు వన్డేల్లో పంత్‌ చేసిన స్కోర్లు.. 10, 15, 125,0, 56, 18.. ఇక 2022 ఏడాదిలో 12 వన్డేలు ఆడిన పంత్‌ 223 పరుగులు మాత్రమే చేశాడు. వన్డేలతో పోలిస్తే టి20ల్లో అతని బ్యాటింగ్‌ కాస్త బెటర్‌గా కనిపిస్తుంది.

రానున్న వన్డే వరల్డ్‌కప్‌ 2023ని దృష్టిలో పెట్టుకొని చూస్తే సంజూ శాంసన్‌కు అవకాశాలు ఎక్కువగా ఇవ్వాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇక బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో టీమిండియా మూడు వన్డేలు ఆడనుంది. వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియా 21 మ్యాచ్‌లు మాత్రమే మిగిలిఉన్నాయి. దీంతో శాంసన్‌కు కాస్త ఎక్కువ అవకాశాలు ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

చదవండి: పంత్‌ సెంచరీ చేసి ఎన్నాళ్లైందని! అతడికి కచ్చితంగా అండగా ఉంటాం: కోచ్‌

మరిన్ని వార్తలు