కోహ్లీ సేనకు గుడ్‌ న్యూస్‌.. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న పంత్‌

19 Jul, 2021 20:28 IST|Sakshi

డర్హమ్‌: కోహ్లీ సేనకు గుడ్‌ న్యూస్‌. ఇంగ్లండ్ పర్యటనలో కరోనా బారిన పడిన టీమిండియా వికెట్ కీపర్, డాషింగ్‌ బ్యాట్స్‌మన్ రిషబ్‌ పంత్ కోలుకున్నాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో అతనికి నెగటివ్ వచ్చినట్లు జట్టు వర్గాలు వెల్లడించాయి. దీంతో డర్హమ్‌లో ఏర్పాటు చేసిన టీమిండియా ప్రాక్టీస్ క్యాంప్‌లో అతను జూలై 21న చేరనున్నాడు. అయితే, రేపటి(జులై 20) నుంచి కౌంటీ ఎలెవన్‌తో ప్రారంభమయ్యే సన్నాహక మ్యాచ్‌కు మాత్రం అతను దూరం కానున్నాడు.

కాగా, ఇంగ్లండ్‌లోని వివిధ కౌంటీ జట్ల నుంచి 15 మంది ఆటగాళ్లు కౌంటీ ఎలెవన్‌ తరఫున ఆడనున్నారు. వార్విక్‌షైర్ కెప్టెన్ విల్ రోడ్స్ ఈ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఈ మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఖాళీ స్టేడియంలో జరగనున్నట్లు డర్హమ్‌ కౌంటీ బోర్డు ప్రకటించింది. ఇదిలా ఉంటే, త్రోడౌన్ స్పెషలిస్ట్ దయానంద్ గరానీకి కూడా కరోనా పాజిటీవ్‌గా తేలడంతో అతనితో సన్నిహితంగా ఉన్న వృద్దిమాన్ సాహా ఐసోలేషన్‌లో ఉన్నాడు. దీంతో రేపటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయనున్నాడు.

ఇంగ్లండ్‌లో ఇటీవల డెల్టా వేరియంట్ కరోనా వైరస్‌ వేగంగా వ్యాపి చెందుతోంది. రిషబ్‌ పంత్ కూడా ఈ వైరస్‌ బారిన పడినట్లు ప్రచారం జరిగింది. ఇటీవల యూరో ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌ను చూసొచ్చిన పంత్.. తేలికపాటి జ్వరంతో బాధపడ్డాడు. ఆ సమయంలో చేయించుకున్న పరీక్షల్లో అతనికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. మరోవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ అనంతరం భారత ఆటగాళ్లకు బీసీసీఐ బ్రేక్ ఇచ్చింది. దాంతో బయో బబుల్ వీడిన ఆటగాళ్లు 20 రోజుల పాటు ఇంగ్లండ్ పర్యాటక ప్రదేశాలను సందర్శించారు. అనంతరం డర్హమ్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ పూర్తి చేసుకొని ప్రాక్టీస్ మ్యాచ్‌కు సిద్దమయ్యారు.
 

>
మరిన్ని వార్తలు