కోహ్లి వికెట్‌ తీసిన ఆనందంలో బౌలర్‌.. సరదా తీర్చిన పంత్‌

4 Mar, 2022 20:17 IST|Sakshi

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో తొలిరోజు ఆటలో టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ హైలెట్‌గా నిలిచాడు. టెస్టు మ్యాచ్‌లో వన్డే మ్యాచ్‌ను తలపించేలా పంత్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 97 బంతులెదుర్కొని 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేశాడు. నాలుగు పరుగులతో సెంచరీకి దూరమైనప్పటికి తన మెరుపు ఇన్నింగ్స్‌తో అభిమానులను అలరించాడు.

ఇక విషయంలోకి వెళితే.. టీమిండియా తరపున పంత్‌ హైలెట్‌ అయినట్లే.. లంక తరపున లసిత్‌ ఎంబుల్డేనియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. వందో టెస్టు ఆడుతున్న కోహ్లి వికెట్‌ తీసింది ఎంబుల్డేనియానే.  మ్యాచ్‌లో ఇప్పటివరకు 28 ఓవర్లు వేసి కోహ్లితో పాటు మయాంక్‌ అగర్వాల్‌ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే వందో టెస్టు ఆడుతున్న కోహ్లి వికెట్‌ను తీశానని సంతోషంలో మునిగితేలుతున్న ఎంబుల్డేనియాకు పంత్‌ ఒక ఓవర్‌లో చుక్కలు చూపించాడు. ఆ ఒక్క ఓవర్‌ను పంత్‌.. టెస్టును కాస్త టి20గా మార్చేశాడు. ఇన్నింగ్స్‌ 76వ ఓవర్‌ వేసిన ఎంబుల్డేనియాకు పంత్‌ చుక్కలు చూపించాడు.

తొలి బంతినే డీప్‌మిడ్‌ వికెట్‌ మీదుగా సిక్స్‌.. రెండో బంతికి మరో సిక్స్‌ బాదాడు. నాలుగు, ఐదు బంతులను బౌండరీకి తరలించాడు. మొత్తంగా ఆ ఓవర్‌లో 22 పరుగులు పిండుకొని ఎంబుల్డేనియా సరదా మొత్తం తీర్చేశాడు. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న రవీంద్ర జడేజా పంత్‌ విధ్వంసాన్ని కళ్లారా చూడగా.. అటు డ్రెస్సింగ్‌రూమ్‌లో రోహిత్‌ శర్మ సూపర్‌గా ఎంజాయ్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో బీసీసీఐ షేర్‌ చేసింది. 

తొలిరోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 85 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. జడేజా 45, అశ్విన్‌ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.  తొలిరోజు ఆటలో టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయినప్పటికి లంకపై స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది.

మరిన్ని వార్తలు