Rishabh Pant: రిషభ్ పంత్‌ మోకాలి సర్జరీ సక్సెస్‌.. కానీ!

7 Jan, 2023 15:50 IST|Sakshi

టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ కారు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. అతడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. పంత్‌ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో పంత్‌కు శుక్రవారం శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది.

కోకిలాబెన్ ఆసుపత్రిలోనే అతడి మోకాలి లిగమెంట్లకు సర్జరీ చేయించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా పంత్‌ ఆరోగ్యం కాస్త కుదుటపడ్డాక లండన్‌లో సర్జరీ చేయంచాలని తొలుత బీసీసీఐ భావించింది. కానీ ఇప్పడు ముంబైలోనే చేయించినట్లు సమాచారం.

"రిషభ్ పంత్‌ మోకాలి లిగమెంట్ల శస్త్రచికిత్స శుక్రవారం విజయవంతమైంది. ప్రస్తుతం అతడు వైద్యుల పరిశీలనలో ఉంచారు. తదుపరిగా ఏం చేయాలో, పునరావాసం(రిహాబిలిటేషన్‌)కు ఎప్పుడు పంపించాలో డాక్టర్‌ దిన్‌షా పార్ధీవాలా నేతృత్వంలోని వైద్యబృందం తెలియజేస్తుంది.

అదేవిధంగా ఈ వైద్య బృందం, బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ టీంతో నిరంతరం టచ్‌లో ఉంటుంది" అని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐతో పేర్కొన్నారు. అయితే పంత్‌ మాత్రం పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధించడానికి దాదాపు 7 నుంచి 9 నెలల సమయం పట్టనున్నట్లు సమాచారం. దీంతో అతడు స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌కు కూడా దూరమయ్యే ఛాన్స్‌ ఉంది.
చదవండి: IPL 2023: ఐపీఎల్‌ వేలానికి ముందు ఈ సిరీస్‌ జరిగి ఉంటేనా! కానీ పాపం..

మరిన్ని వార్తలు