సెహ్వాగ్‌, సచిన్‌ సూపర్‌ ఇన్నింగ్స్.. ఘన విజయం

6 Mar, 2021 10:42 IST|Sakshi

న్యూఢిల్లీ: రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌-2021లో ఇండియా లెజెండ్స్‌ జట్టు శుభారంభం చేసింది. బంగ్లాదేశ్‌ లెజెండ్స్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక రాయ్‌పూర్‌లో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ దిగ్గజాలు, సచిన్‌ టెండుల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ అద్భుతమైన ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంకా 59 బంతులు మిగిలి ఉండగానే 110 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. వ్యక్తిగత స్కోర్ల వివరాలు గమనిస్తే.. సెహ్వాగ్‌ 35 బంతుల్లో 80 పరుగులతో(10 బౌండరీలు, 5 సిక్సర్లు) రాణించగా, సచిన్‌ 26 బంతుల్లో 33 పరుగులు చేశాడు.
 
దీంతో ఇండియా లెజెండ్స్‌ 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి బంగ్లా జట్టును మట్టికరిపించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ టీ20 టోర్నీలో జరిగిన ఈ తొలి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ లెజెండ్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇండియా లెజెండ్స్‌ బౌలర్ల ధాటికి ఏమాత్రం నిలవలేక 19.4 ఓవరల్లో 109 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. ప్రజ్ఞాన్‌ ఓజా, యువరాజ్‌సింగ్‌, వినయ్‌ కుమార్‌ రెండేసి వికెట్లు తీయగా, మన్‌ప్రీత్‌ గోని, యూసఫ్‌ పఠాన్‌ చెరో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా సచిన్‌ పాజీతో మళ్లీ ఓపెనింగ్‌ చేయడం ఆనందంగా ఉందంటూ ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలను సెహ్వాగ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

చదవండివీరు విధ్వంసం.. 

మరిన్ని వార్తలు